- అర్బన్ ప్రాంతాల్లోనూ జలధార
- తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్య రాకూడదు
- పేదలు సంతృప్తికరంగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ
- వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులుండాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “జూన్లో స్కూళ్ల రీ-ఓపెనింగ్ నాటికి హాస్టళ్లు అన్నీ చక్కగా ఉండాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. టాయిలెట్లు.. ఆర్వో ప్లాంట్లు సిద్ధంగా ఉండాలి. హాస్టళ్లకు సంబంధించి వసతులపై ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు. హాస్టళ్లల్లో వసతులు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించాం. సాస్కీ నిధులతో ఈ పనులు చేపడుతున్నాం.
నిధులు అందించిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుంది. వసతులను ఏర్పరచడమే కాకుండా… వాటిని సక్రమంగా నిర్వహించేలా కూడా చూడాలి. ఈమేరకు నిరంతర పర్యవేక్షణ చేపడుతూనే ఉండాలి. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు… పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి. ఇక నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలూ కన్పించకూడదు. తాగునీటి సరఫరా, వీధి దీపాల విషయంలో ఫిర్యాదులు రాకూడదు. అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకంగా మౌలిక సదుపాయల కల్పన విషయంలో ఫిర్యాదులు రాకూడదు. తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి. తాగునీటిని అందించడంతోపాటు.. స్వచ్ఛమైన తాగునీరును… కలుషితంలేని నీటిని ప్రజలకు అందించేలా చూడాలి. తాగునీటి పైప్ లైన్లల్లో డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచూ నీటి శాంపిళ్లను కలెక్ట్ చేసి ల్యాబుల్లో టెస్ట్ చేయించాలి.
వీధి దీపాలు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. సెన్సిటివ్ ప్రాంతాల్లో వీధి దీపాల సమస్య ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ ఎక్కడా ఆగకూడదు. పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ, చెత్త సేకరణవంటి అంశాల్లో ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే మెకానిజం ఉండాలి. పని పూర్తి చేశాక స్థానికులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. మున్సిపల్ అధికారులు స్పందించారనే భావన ప్రజలకు కలిగేలా చేయాలి. మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేయాలి. ఈమేరకు మున్సిపల్ అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. స్వచ్ఛ సర్వేక్షణ్వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ ఫలితాలు స్పష్టంగా పట్టణాల్లో కన్పించాలి. తాడిపత్రి పట్టణంలో పారిశుద్ధ్యం చక్కగా నిర్వహిస్తారు. అక్కడి నాయకులు చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేతలు చొరవ తీసుకున్నచోట మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి. స్వచ్ఛత విషయంలో తాడిపత్రి రోల్ మోడల” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యం
“మహిళలపై నేరాల విషయంలో ఏమాత్రం అలక్ష్యం వద్దు. మహిళల జోలికి రావాలన్నా.. అఘాయిత్యం చేయాలనే ఆలోచన రావాలన్నా ఒణికి పోయే పరిస్థితి తీసుకురావాలి. సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నామో.. దానికి పదింతల ప్రాధాన్యత మహిళలు, చిన్నారుల భద్రతకు ఇస్తున్నాం. శాంతి భద్రతలను పాటించే విషయంలో నేరాలను కట్టడి చేసే సందర్భంలో ఏమాత్రం రాజీ పడొద్దు. తప్పు చేసిన వారిని త్వరితగతిన అరెస్ట్ చేయడమే కాదు… వారికి శిక్షలు పడేలా చూడాలి. మహిళల్లో భయాన్ని పోగొట్టాలి. తప్పు చేసేవారిలో భయాన్ని పెంచాలి. మహిళా భద్రతకు సంబంధించి నిరంతరం ప్రజల్లో అవగాహన పెంచాలి. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, సాగు, వినియోగం ఉండేది. నాటి పరిస్థితితో పోల్చుకుంటే చాలావరకు తగ్గింది. గంజా, డ్రగ్స్ ప్రభావం కన్పించకుండా చర్యలు తీసుకోవాలి.
గంజా నివారణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈగల్ విధానాన్ని ఒడిషా ప్రభుత్వం అధ్యయనం చేసింది. మన రాష్ట్ర విధానాన్నే ఒడిషా అవలంభిస్తోంది. అన్న క్యాంటీన్లను మరింత విస్తరిస్తున్నాం. అర్బన్ ప్రాంతాల్లోనే కాకుండా రూరల్ నియోజకవర్గాల్లోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నాం. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టడమనేది ప్రభుత్వ బాధ్యత. పేదలు సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేసేలా అన్న క్యాంటీన్లను నిర్వహించాలి. అన్న క్యాంటీన్ల నిర్వహణ ఎలా ఉందో తెలుసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి. కొత్తగా అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే… ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతుంది. అన్న క్యాంటీన్లకు స్వచ్చందంగా విరాళాలు ఇచ్చేలా మోటివేట్ చేయాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
విద్యార్థి దశనుంచే ఆవిష్కరణల ఆలోచనలు
“రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వీలైనన్ని ఇన్నోవేషన్లు వచ్చేలా చూడడంతోపాటు… విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలు చేయాలన్న ఆలోచనలు రేకెత్తించే విధంగా ఆర్టీఐహెచ్ చొరవ తీసుకోవాలి. యంగ్ స్టూడెంట్ ఇన్నోవేటర్లను తీర్చిదిద్దేలా చూడాలి. అగస్త్యవంటి సంస్థలు విద్యార్థుల్లో ఆవిష్కరణను ప్రొత్సహిస్తున్నాయి. వినూత్నంగా ఆలోచన చేస్తున్నాయి. ఇలాంటి సంస్థలతో ఆర్టీఐహెచ్ కలిసి పని చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. 175 నియోజకవర్గాల్లో ఉండే ఎంఎంసఎంఈ పార్కులతో ఆర్టీఐహెచ్ అనుసంధానమై పని చేస్తే ఎలా ఉంటుందో ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎన్విడియావంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తే… ఎకో సిస్టం ఏర్పడుతుంది. ఏజెన్సీ ఏరియాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించే అంశంపై ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాలి.
అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాల్లో డ్రోన్ల ద్వారా హెల్త్ సర్వీసులు అందించే పైలెట్ ప్రాజెక్టులు చేపట్టాలి. ఈ ప్రయోగం దేశానికి ఓ మోడల్లా ఉండాలి. జలధార కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలి. నరేగా అనుసంధానంతో పాటు… అవసరమైన ప్రాంతాల్లో యంత్రాలను వినియోగించుకోవాలి. అన్ని చెరువులకు నీళ్లు నింపే విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్ అవలంభించాలి. డ్రైన్లు, కాల్వలను బాగు చేయాలి. 15న సాగుకు నీటి విడుదల చేపడతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని జలధార పనులు చేపట్టాలి. అవసరమైతే అన్నమయ్య జిల్లాకు మిగిలిన జిల్లాలనుంచి బృందాలు పంపి ట్రైనింగ్ ఇప్పించండి. అర్బన్ ప్రాంతాల్లో కూడా జలధార కార్యక్రమం చేపట్టాలి. జలధారపై ప్రతీవారం సమీక్షిస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















