- ఆగస్టు 15నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
- ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసమే.. ఈ పథకం
- టెక్నాలజీ వినియోగంలో నేను జెన్ జీ వర్గమే
- నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష
- కాలర్ ఎగరేసి చెప్పకునేలా అమరావతి నిర్మాణం
- నిర్మాణ వేగం ఓర్వలేకే రాజధానికి వైసీపీ కూతలు
- ఛీ ఛీ అంటున్నా… మావిగన్ పట్టుకుని వేలాడుతున్నారు
- వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్తో సమాజం, ఆడబిడ్డకు రక్షణ లేదు
- గిద్దలూరు కిష్టంశెట్టిపల్లెలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
- సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
మార్కాపురం (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసమే సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులతో కూడిన సంజీవని ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ కేర్ వరకూ వైద్య సేవలు అందేలా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుందని సీఎం వివరించారు. ప్రజలందరికీ సంపూర్ణ వైద్య సేవలు అందించేలా సంజీవని కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరెటివ్ విధానం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడతామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ వరకూ మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానిస్తామని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “సంజీవని ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్, ఆరోగ్యంపై ఫాలోఅప్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సేవలు అందుతాయి. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.61 కోట్ల మందికి ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించాం. డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్ డిసీజ్ ప్రొఫైల్స్ను విశ్లేషిస్తాం. సంజీవని లాంటి కార్యక్రమాల అమలుకు ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు కావాలి. మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయామంతో ఆరోగ్యం కాపాడుకోవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాను. తాజా ఆహారం, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటివి తీసుకోవాలి. ఆహారంలో కార్బొహైడ్రేట్స్ తగ్గించాలి. పేదల సంక్షేమంపై ఉన్న ఆలోచనతోనే పథకాలు అందిస్తున్నాం. స్త్రీశక్తితో ఉచిత ప్రయాణం, దీపం 2.0 లాంటి పథకాలు మహిళలకే అమలు చేస్తున్నాం. అన్నదాతకు అండగా ఉండేలా మొదటి విడత నిధులు విడుదల చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం పథకం కింద నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల పరపతి పెరిగింది. చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదు. విచ్చలవిడిగా ఎరువులు, పురుగుమందులు వాడకుండా రైతుల కోసం ఓ యాప్ తీసుకువచ్చాం. మన దగ్గర నుంచి ఎగుమతి చేసిన మిరపలో క్రిమి సంహారకాలు ఉన్నాయని చైనా వెనక్కు తిప్పి పంపింది. అందుకే ప్రకృతి సేద్యం చేసి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేద్దాం.” అని ముఖ్యమంత్రి అన్నారు.
జెన్ జీ కంటే వేగంగా ఆలోచన
“ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని. భవిష్యత్తును ముందే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాను. ఏఐ, క్వాంటం టెక్నాలజీల్లో మన యువత నిష్ణాతులు కావాలి. చిన్న కుటుంబాలు భారతదేశ సంప్రదాయం కాదు, ఉమ్మడి కుటుంబమే ఆనందదాయకం అని గుర్తించాలి. జనాభా నిర్వహణ ఇప్పుడు తక్షణ అవసరంగా మారింది. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ప్రపంచంలోని కొన్ని దేశాలు జనాభా లేక ఇబ్బందులు పడుతున్నాయి. అమరావతి రాజధాని నగరాన్ని హరిత నగరంగా, నివాసయోగ్య ప్రాంతంగా నిర్మిస్తున్నాం. మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ధి చేస్తాం. గొడ్డలి పార్టీ ముందు అమరావతిని అంగీకరించి ఆ తర్వాత మూడు ముక్కల ఆట ఆడింది. ఐదేళ్ల పాటు తాత్సారం చేసిన గొడ్డలి పార్టీ అభివృద్ధిని ఆమడ దూరం పెట్టింది. గొడ్డలి పార్టీ నేతలు మోసాలు చేయడంలో దిట్టలు. అమరావతి చట్టం కూడా అయిపోయాక మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే ఎవరికీ అర్థం కాదు. అందరూ ఛీ కొడుతున్నారు. బాధ్యత లేని రాజకీయ పార్టీ ప్రజల్ని, వారి నిర్ణయాన్ని అపహాస్యం చేస్తోంది.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష
“మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూడా నాకే వచ్చింది. రూ.3,900 కోట్ల పనులు చేయాల్సి ఉన్నా గత పాలకుడు ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాసం కింద నేడు రైతులకు రూ.300 కోట్లు ఇచ్చాం. త్వరలోనే మరో రూ.600 కోట్లు విడుదల చేస్తాం. రెండు దశలలో 4 లక్షల ఎకరాలకు పైచిలుకు ప్రాంతంలో ఆయకట్టుకు నీరు అందుతుంది. రామాయపట్నం పోర్టు కూడా త్వరలోనే పూర్తై పరిశ్రమలు వస్తాయి. ఇక్కడి యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా పారిశ్రామిక క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమను హార్టీకల్చర్ హబ్ చేస్తాం. వివిధ రకాల పండ్ల తోటలతోపాటు వాణిజ్య పంటలు పండించేందుకు వీలుగా కార్యాచరణ చేపడతాం. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే వెంటనే స్పందించి ఆ గేటు బిగించి 33 కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశాం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిసి రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాం. గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగేలా గోదావరి-నల్లమల సాగర్ లింక్తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. గోదావరి నుంచి కావేరి నది వరకూ నీటిని తీసుకెళ్తాం. నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ కడుపు ఉబ్బరం అవసరం లేదు. రైతు ప్రయోజనాలే ముఖ్యం కావాలి. ఎల్ నినో వల్ల వర్షాలు లేక నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గాయి. పర్యావరణం, నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడమే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం. చెక్ డ్యామ్లు కడితే ఎగతాళి చేశారు. సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడపాలన్నదే నా లక్ష్యం. జలధార ద్వారా భూగర్భజలాలు పెంచి అన్నమయ్య జిల్లా విజయం సాధించింది. ఇంత చేస్తుంటే కులం, మతం, ప్రాంతం అని కొందరు కుట్రలు చేస్తున్నారు. సమర్థవంతమైన ప్రభుత్వమే ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయగలుగుతుందని” సీఎం స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణం అడ్డుకోడానికే వైసీపీ కుతంత్రాలు
“గత పాలనలో విధ్వంసంతో నలిగిపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా పనిచేస్తున్నాం. రూ.10 లక్షల కోట్ల అప్పులు, వ్యవస్థల విధ్వంసం, కనీసం నలుగురు వ్యక్తులు కలిసి మాట్లాడుకోలేని దుస్థితి గత పాలనలో ఉంది. నేడు మనం అంతా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదే నాటికి నేటికి ఉన్న తేడా. బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రాబందుల తరహాలో వేచి ఉన్నారు. ఏమీ జరక్కపోయినా ఏవో నేరాలు చేసి ఎవరో ఒకరిపై నెట్టేసి గొడ్డలి పార్టీ డైవర్ట్ చేస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ ఘటనకు కులం రంగు పులిమి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విమర్శలు చేశారు. హోం మంత్రి అనిత మేకప్ గురించి ఆమెను అవమానించేలా కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. మహిళల మేకప్ గురించి మాట్లాడటానికి ఆ పార్టీ వారికి సిగ్గు అనిపించడం లేదు. పోలీసులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోం. అమరావతిపై కుట్ర చేయడానికే వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారు. రాజధాని రైతుల్ని రెచ్చగొట్టడానికే అమరావతికి వెళ్లారు. రాజధాని నిర్మాణం జరుగుతుంటే దాన్ని అడ్డుకోడానికే వైసీపీ నేతలు రాజధాని ప్రాంతానికి వెళితే రైతులు వారిని అడ్డగించారు. గొడ్డలి పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంది. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత దానికి లేదు. దేవాలయాలపై దాడులు చేసిన వ్యక్తులు ఇప్పుడు దేవాలయాల సందర్శనకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు, మోసాలు చేస్తున్నారు. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. నేరస్థులైన రాజకీయ పార్టీలు, నేతలతో నేను పోరాడలేదు. ఆ పార్టీది పూర్తిగా క్రిమినల్ పాలిటిక్స్. గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ను తయారు చేసి అరాచకం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదు. వారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతోంది.” అని ముఖ్యమంత్రి అన్నారు. అనంతరం మార్కాపురం జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలకు సంబంధించిన రిపోర్టు కార్డును సీఎం ప్రజల ముందు ఉంచారు. ప్రజామోదం లేని పాలనను సహించేది లేదని స్పష్టం చేశారు. పౌర సేవలను అందించే అంశంపై ఆకస్మిక తనిఖీలకూ వస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డీబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.















