- అధికార గర్వానికి ప్రజలు నేర్పిన గుణపాఠమే 2024 తీర్పు
- ప్రజలు మనకిచ్చింది అధికారం కాదు.. రాష్ట్ర పరిరక్షణ బాధ్యత
- గాంధీ, అంబేద్కర్ ఆశయాల సమాహారమే ప్రధాని మోదీ పాలన
- నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రే కీలకం
- స్థానిక సంస్థలను బలహీనపర్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం
- కుల, ప్రాంతీయ పరిమితులుదాటి భారతీయత వైపు అడుగులేûద్దాం
- వ్యవస్థలపై నమ్మకం తగ్గితే సమాజం ముక్కలవుతుంది
- రెండేళ్లలో మేము నిర్మించింది రోడ్లు, భవనాలు కాదు.. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం
- అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ విడిపోతే వ్యవస్థలు కుప్పకూలతాయి
- సమస్య నిధుల కొరత మాత్రమే కాదు.. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే
- పంచాయతీరాజ్ వ్యవస్థ నాయకులను తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల
- డిజిటలైజేషన్తో పల్లెల ముఖచిత్రాలు మారుతున్నాయి
- వచ్చే ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం నిర్ణయాలు తీసుకుందాం
- రాబోయే తరాలు గర్వించే సమాజ నిర్మాణమే కూటమి సమష్టి బాధ్యత
- తిరుపతి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన
తిరుపతి (చైతన్య రథం): ‘సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు… అహంకారంపై సామాన్యుడు సంధించిన బలమైన సందేశం. భయాన్ని, అహంకారాన్ని, అధికారమే అంతా అనే అనాగరిక రాజకీయ సంస్కృతిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని నిరూపించారు. ప్రజలు మనకిచ్చింది కేవలం అధికారం కాదు, రాష్ట్రాన్ని కాపాడి ప్రగతిపథంలో నడిపించే గొప్ప బాధ్యత’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకీ, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదు, ఇది ప్రజా విజయమన్నారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన పార్టీ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమైన జనసేన త్యాగానికి ప్రజలు 100 శాతం స్ట్రయిక్ రేట్తో సమాధానమిచ్చారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించి నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని నరేంద్ర మోదీకి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన 21 సీట్లకు సరిపెట్టుకున్నప్పుడు చాలామంది విమర్శలు చేశారు. మేము రాజీపడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకు పరిమితమయ్యాం. ఆ త్యాగం ఫలితంగా ఈరోజు మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆచరణలో కనబడుతున్నాయి. పెరిగిన వృద్ధాప్య పింఛన్లు, మహిళలకు ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అండగా అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు -ప్రతి అంశంలో మేము ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆచరణలో పెడుతున్నాం.
ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థే
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, దీనదయాళ్ ఉపధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన ప్రజాస్వామ్య పునాదుల ఆలోచనల సమాహారమే నేటి ప్రధాని మోదీ పాలనా తత్వం. “సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస”. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా చూడాలన్న ఆకాంక్షతో మాట్లాడుతున్నాను. పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో నిర్ణయించబడినట్టే, దేశ భవిష్యత్తు గ్రామాల్లో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, కుటుంబం ఆరోగ్యం.. ఇవన్నీ గ్రామ పంచాయతీల ద్వారానే ప్రభావితమవుతాయి. ఏ పనిని ప్రజలకు దగ్గరగా సమర్థంగా చేయగలమో ఆ పనిని అక్కడే చేయాలి. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్లకూడదు.
అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు
అధికారాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 600 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యానికి వారే వేళ్లు. ఆ వేళ్లను బలహీనపరిస్తే చెట్టు నిలబడదు. స్థానిక సంస్థలను బలహీనపర్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం. రెండేళ్లలో గ్రామాల్లో నిర్మించడానికి ప్రయత్నించింది కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు.. వ్యవస్థలపై నమ్మకం. వ్యవస్థ బలహీనపడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు, నమ్మకం. వ్యవస్థ న్యాయం చేయకపోతే కులం ముందుకు వస్తుంది. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం చిన్న చిన్న గుంపులుగా విడిపోతుంది.
మనమంతా భారతీయత వైపు అడుగులు వేయాలి
తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే కులాల పరిమితులు, ప్రాంతీయత దాటి మనమంతా భారతీయత వైపు అడుగులు వేయాలి. అందుకే పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పథకాలకు పరిమితం కావడం లేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సామాజిక సమతుల్యత, జాతీయ సమైక్యత, సామాజిక పరస్పర విశ్వాసం తదితర అంశాలపై మాట్లాడుతున్నాను. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పెదపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య పరిష్కారం. గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణల కోసం బల్వంత్ మెహతా, అశోక్ మెహతా, జీవీకే రావు, ఎల్.ఎన్. సింగ్ తదితరులు ఎన్నో సూచనలు చేశారు. ఇవి 1992-93 రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకున్నాయి. 1993 నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. ఆర్టికల్ 243 నుంచి 243(ఓ) వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ కల్పించింది. 11వ షెడ్యూల్ ద్వారా 22 అంశాలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. దేశవ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ పంచాయతీలు, 30 లక్షల మంది స్థానిక ప్రజాప్రతినిధులు, 14 లక్షలకు పైగా మహిళా ప్రజాప్రతినిధులతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్రూట్ ప్రయోగం.
అయితే ఈ వ్యవస్థ నిజంగా గ్రామానికి అధికారాన్ని ఇచ్చిందా? నిధులు, నిర్ణయాధికారం, బాధ్యత గ్రామానికి చేరాయా? పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రివ్యూల్లో తేలింది ఒకటే — గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్కి, జెండా పండుగ చేయడానికి డబ్బులు లేవు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారినపడ్డాయి. వేల కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. గ్రామ స్థాయి పాలన బలహీనపడింది.
గ్రామ సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం వెతకాలి
రాజ్యాంగం పంచాయతీలకు హోదా ఇచ్చినా దానికి జీవం పోయాల్సింది మనమే. సమస్య కేవలం నిధుల కొరత మాత్రమే కాదు.. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే అసలు కారణం. అథారిటీ ఒకచోట, బాధ్యత ఇంకోచోట, అకౌంటబిలిటీ మరోచోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీన్నే బ్రోకెన్ గవర్నెన్స్ చైన్ అంటారు. గ్రామ సమస్యలకు పరిష్కారం గ్రామాల్లోనే వెతకాలి. అందుకోసం గ్రామ సభలను అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చాం. ఎక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ నీరు అవసరం, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది. ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు, గ్రామ సభలో తీసుకోవాలి. ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. గ్రామసభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై, పరిశ్రమల రాకపై, యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టి రాష్ట్ర భవిష్యత్తు నిర్మిస్తారు.
పంచాయతీలనుంచే బలమైన నాయకత్వం పుడుతుంది
ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. అది గ్రామ సభల్లో, పంచాయతీల్లోనే రూపుదిద్దుకుంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు — అది నాయకత్వాన్ని తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రయాణాన్ని ఒక మున్సిపల్ కౌన్సిలర్గా స్థానిక సంస్థల నుంచే మొదలుపెట్టారు. నాయకత్వం అంటే కేవలం రాజకీయ నాయకత్వం కాదు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీగల అధికారి కూడా నాయకులే. 50 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల ద్వారా ముందుకు వస్తున్నారు. వెనుకబడిన తరగతులు, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత మొదటి అడుగు గ్రామ స్థాయిలోనే వేయాలి.
గ్రామ సభతో ప్రతి గడపకు ప్రజాస్వామ్యం
అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఆ స్థిరత్వం ఆధారంగా 13,326 పంచాయతీల్లో ఒకే సారి గ్రామ సభలు నిర్వహించాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. పల్లెపండుగను ప్రజా ఉద్యమంగా మార్చాం. స్థానిక నాయకత్వానికి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టాం.
స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేశాం. పంచాయతీ రికార్డుల్లో కనిపించని ఆస్తులు మొదటిసారి వ్యవస్థల్లో కనిపించాయి. ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కు పెరిగింది. ఫలితంగా పంచాయతీ ఆదాయ సామర్థ్యం రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెరిగింది — ఒక్క రూపాయి పన్ను పెంచకుండా. వ్యవస్థలు సరిగా పని చేస్తే గ్రామాలు సృష్టించగల సామర్థ్యానికి ఇది ఒక బలమైన ఉదాహరణ.
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు — 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమవుతుంది. ఒక చిన్న వాగు తన పరిసరాల్లోని భూములకు నీరందించి తదుపరి నదుల్లో కలిసినట్టు, ప్రతి పంచాయతీ తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బలపడుతుంది.
రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది కేవలం అధికార బదిలీ కాదు, నమ్మకం బదిలీ. నమ్మకాన్ని నిలుపుకోవడమే మన బాధ్యత. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థలను నమ్మాలి. నాయకులను కాకుండా సంస్థలను, వ్యక్తులను కాకుండా విలువలను నమ్మాలి — అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతమవుతుంది. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది.
మన నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉండాలి. రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడం కూటమి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంతో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతతో కూడిన అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటున్నాను” అన్నారు.
చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి వెంకట మణిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర విద్య, ఐటి, కమ్యూనికేషన్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













