- ఏయూ ఏపీకి మాత్రమే కాదు.. భారతదేశానికే గర్వకారణం
- దేశంలోనే అత్యంత ప్రాచీన యూనివర్సిటీల్లో ఏయూ ఒకటి
- ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతోమంది కృషిచేశారు
- దేశంలోనే ఓవరాల్ ర్యాంకింగ్స్లో 3వ స్థానం సాధించడమే లక్ష్యం
- ఫిజిక్స్నుంచి పాలిటిక్స్ వరకు వర్సిటీ మార్క్ శాశ్వతం
- పరిశ్రమలతో అనుసంధానం అనేది చాలా ముఖ్యం
- రీసెర్చ్ కోసం ఏయూకు రూ.250 కోట్లు కేటాయించాలి
- ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఇనిస్టిట్యూషన్ మాత్రమే కాదని, తనలాంటి వారికి ఒక ఎమోషన్ అని, ఏయూ ఏపీకి మాత్రమే కాదు.. భారతదేశానికే గర్వకారణమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వేడుకలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఈరోజు ఒక గర్వకారణమైన, చరిత్రాత్మక సందర్భం. శతాబ్దకాలంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం గొప్పదనాన్ని జరుపుకునేందుకు మనం అందరం ఇక్కడకు వచ్చాం.
ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఇనిస్టిట్యూషన్ మాత్రమే కాదు.. నాలాంటి వారికి ఒక ఎమోషన్. తరతరాలుగా మన మనస్సుల్లో మెదులుతోంది. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్కు హృదయపూర్వక స్వాగతం పలకడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మీ సేవాగుణం, నిష్ట, ప్రజాసేవపట్ల మీ అంకితభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తోంది. అదేవిధంగా ఏపీ గవర్నర్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఛాన్స్లర్ ఎస్ అబ్దుల్ నజీర్కు కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. మీ మార్గదర్శకత్వం, నాయకత్వం ఈ గొప్ప సంస్థను మరింత బలపరుస్తోంది. అదేవిధంగా లక్షలాది హృదయాలను గెలుచుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా. క్రమశిక్షణ, అంకితభావం, ప్రతిభకు ఆయన నిదర్శనంగా నిలుస్తారు. దార్శనికనేత, గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం. విద్యే అభివృద్ధికి పునాది అని ఆయన విశ్వసిస్తారు. వేదికపై ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ హరిబాబు, ఇక్కడకు విచ్చేసిన ఇతర ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ పేరు కాదు.. వందేళ్ల చరిత్ర
“2014లో రాష్ట్రం విడిపోయింది. కట్టుబట్టలతో మెడపట్టి మనల్ని బయటకు గెంటేశారు. రాజధాని లేదు. సచివాలయం లేదు. అసెంబ్లీ లేదు. ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ లేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉన్నవి రెండే. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండు మన బ్రాండ్ సీబీఎన్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక హాల్ కూడా లేదు. ఆ రోజు మొదటి కేబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకున్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి అసెంబ్లీ సమావేశాలు కూడా ఏయూలోనే నిర్వహించాం. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు.. వందేళ్ల చరిత్ర” అని విశదీకరించారు.
దేశంలోనే అత్యంత ప్రాచీన యూనివర్సిటీల్లో ఏయూ ఒకటి
“స్వాతంత్య్రం రాకముందు తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రాచీన యూనివర్సిటీల్లో ఏయూ ఒకటి. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిది ఆంధ్ర రాష్ట్రం. తెలుగు ప్రజల కోసం మనం యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూసి అసూయపడుతున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఉంటే ఎంతో బాగుండేదని. పక్కనే వైజాగ్ బీచ్ రోడ్.. అద్భుతమైన సిబ్బంది, ఏయూ స్టూడెంట్స్ జోషే ఈ రోజు అదిరిపోతోంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పనిచేయాలి. వచ్చే వందేళ్ల చరిత్ర కలిసికట్టుగా సృష్టించాలని కోరుతున్నా” అని లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతోమంది త్యాగం ఉంది
“మానసిక వికాసం మానవ జీవితానికి అత్యున్నత లక్ష్యంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతోమంది త్యాగం ఉంది. ఎంతోమంది పోరాటం ఉంది. కష్టం ఉంది. సీఆర్ రెడ్డి మొదటి వైస్ ఛాన్స్లర్గా ఒక క్లియర్ డైరెక్షన్ మనకు అందించారు. తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ ఛాన్స్లర్గా పనిచేశారు. ఆయన విజన్, స్పీడ్, కమిట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీకి బలమైన పునాది వేసింది. ఎంతోమంది దాతలు ఏయూ అభివృద్ధికి సహకరించారు. ఎంతోమంది వైస్ ఛాన్స్లర్లు ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి కృషిచేశారు. వైస్ ఛాన్స్లర్లకి విజన్ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలాంటి గొప్ప యూనివర్సిటీలు తయారవుతాయి” అన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ ఏపీకి మాత్రమే కాదు.. భారతదేశానికే గర్వకారణం
“యూనివర్సిటీని సాధారణంగా విశ్వవిద్యాలయం అంటారు. కానీ మన ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటారు. ఇది అకడమిక్ విద్య, లిబరల్ ఆర్ట్స్ సమ్మిళితం. దీనికి మంచి ఉదాహరణ త్రివిక్రమ్ శ్రీనివాస్. మన ఏయూ నుంచి ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు ప్రఖ్యాత సినీ దర్శకులుగా ఆయన ఎదిగారు. ఆంధ్ర యూనివర్సిటీ చిహ్నం దగ్గరనుంచి కోర్సుల వరకు అన్నీ స్పెషల్. ఉన్నత విద్యలో భిన్నమైన ప్రోగ్రామ్స్ను అందిస్తోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఏయూలో 7 అనుబంధ కళాశాలలతో కలిపి 68 అకడమిక్ విభాగాలున్నాయి. మొత్తం 121 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతోపాటు వివిధ పరిశోధనా కార్యక్రమాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఏయూకి 304 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. సుమారు 85,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 56 దేశాలనుండి వచ్చిన సుమారు 1050 మంది విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏపీకి మాత్రమే కాదు.. భారతదేశానికి గర్వకారణం” అని లోకేష్ ఉద్ఘాటించారు.
దేశంలోనే ఓవర్ ఆల్ ర్యాంకింగ్స్లో ఏయూ 3వ స్థానం సాధించడమే లక్ష్యం
“ఆంధ్ర యూనివర్సిటీ ర్యాంక్స్ సాధించడంలో కూడా ముందుంటుంది. ఐఎస్వొ సర్టిఫికెట్, నాక్ ఏGG గ్రేడ్, 2025 ఎనఐఆరఎఫ్ ర్యాంకింగ్స్లో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోనే ఓవర్ ఆల్ ర్యాంకింగ్స్లో 3వ స్థానం, ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 100లో స్థానం సంపాదించినప్పుడే విద్యా శాఖ మంత్రిగా నాకు సంతృప్తి. ప్రస్తుత వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ దీనిని ఒక లక్ష్యంగా తీసుకుని ఏయూని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని కోరుతున్నా” అని లోకేష్ ప్రతిపాదించారు.
ఫిజిక్స్నుంచి పాలిటిక్స్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ మార్క్ శాశ్వతంగా ఉంది
“ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారు గొప్పస్థాయికి వెళ్లారు. ఫిజిక్స్నుంచి పాలిటిక్స్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ మార్క్ శాశ్వతంగా ఉంది. లోక్సభ తొలి దళిత స్పీకర్గా పనిచేసిన జీఎంసీ బాలయోగి ఏయూ విద్యార్థి. ఉప రాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు, కే.హరిబాబు, దువ్వూరి సుబ్బారావు, బీవీఆర్ మోహన్రెడ్డి, పూర్ణ ఆర్ సగ్గుర్తి, గ్రంధి మల్లికార్జునరావు, చావా సత్యనారాయణ ఏయూ విద్యార్థులే. రాజకీయాల్లో కూడా ఏయూ స్టూడెంట్స్ నెం.1. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఏయూ ప్రొడక్టే. వారి ఎదుగుదల యాధృచ్ఛికం కాదు. నిరంతర పోరాటం, త్యాగం, సంకల్పబలం వల్లే వారు అత్యుతన్నతస్థాయికి ఎదిగారు. సమాజంలో మనం కోరుకున్న మార్పు రావాలంటే రాజకీయాల్లోకి మరింతమంది రావాల్సిన అవసరం ఉంది” అని పిలుపునిచ్చారు.
ప్రజలకు సేవ చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా
ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి నా జీవిత ప్రయాణం గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నా. నేను కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను. వరల్డ్ బ్యాంక్లో పనిచేశా. హెరిటేజ్లో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నా. ప్రజలకు సేవ చేయాలని 2013లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశా. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. మొదటిరోజు బాధపడ్డాను. తర్వాత ఆ బాధ నాలో కసి, పట్టుదల పెంచింది. 2024లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీ 91వేల ఓట్లతో గెలిచాను. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే నో రిస్క్, నో స్టోరీ అని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడున్నవారు జీవితంలో ఎన్నో సాధించారు. ఎంతో త్యాగం చేశారు. సవాళ్లను ఎదుర్కొన్నారు. అపజయాలే విజయానికి సోపానాలు” అని పేర్కొన్నారు.
పరిశ్రమలతో అనుసంధానం అనేది చాలా ముఖ్యం
“ఏయూ వందేళ్ల ప్రయాణం పూర్తిచేసుకుంది. కాలం మారుతోంది. సాంకేతికత మారుతోంది. అందుకే వీసీ ఆధ్వర్యంలో మన కరిక్యులమ్లో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలతో అనుసంధానం అనేది చాలా ముఖ్యం. గౌరవ సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. ఇండస్ట్రీ, అకడమీయా కనెక్ట్ అవసరం ఉందని. కేవలం తరగతి గదుల్లో చదువుకోవడం మాత్రమే కాదు. కనీసం ఒక ఏడాదన్నా ఫీల్డ్కు వెళ్లాలి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం విద్యార్థులపై ఉంది. సీఎం ఆదేశాలను నేను స్వీకరిస్తున్నా. ఆ మార్పు కూడా మేం తీసుకువస్తామని తెలియజేస్తున్నా. నాలుగేళ్ల ఇంజనీరింగ్ చేస్తే జాబ్ రాదు. అదే అమీర్పేటలో నాలుగు నెలల కోర్సు చేసి జాబ్ కొడతారు. అదే స్కిల్ గ్యాప్. దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దానికి మేం అహర్నిశలు కష్టపడతామని తెలియజేస్తున్నా” అన్నారు.
ఏడాదిలోగా పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం
“అతి చిన్న వయసులో విద్యాశాఖ మంత్రిగా నన్ను సీఎం చంద్రబాబు నియమించారు. నేను విద్యాశాఖ తీసుకుంటానంటే కష్టమని, వద్దని చాలామంది వారించారు. దేశ చరిత్ర తిరిగి రాయాలంటే మా పిల్లలే రాయాలని నేను ఛాలెంజ్ను స్వీకరించడం జరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి. నిధులు కేటాయించాలి. మౌలిక వసతులే కాదు.. శాశ్వత సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. పెండింగ్ పోస్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం చెప్పారు. వచ్చే ఏడాదిలోగా పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. హయ్యర్ ఎడ్యుకేషన్పైన ఎక్కువ దృష్టిపెట్టాలని ప్రధాని చెబుతున్నారు. రీసెర్చ్ను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది” అంటూ మంత్రి లోకేష్ భవిష్యత్ లక్ష్యాలను వివరించారుర.
రీసెర్చ్ కోసం ఏయూకు రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరుతున్నా
“ఉత్తరాంధ్ర రాష్ట్రానికి ఒక ఎకనామిక్ జోన్గా మారబోతోంది. రేపు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నాం. గడిచిన ఆరు నెలల్లో ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. సీఎం చేతులమీదుగా ఇంగోట్ సోలార్ వేఫర్ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. వారికి కావాల్సిన కరిక్యులమ్ తయారుచేసే బాధ్యత ఏయూ తీసుకోవాలని కోరుతున్నా. ఆంధ్ర యూనివర్సిటీకి కనీసం రూ.250 కోట్లు నిధులు కేటాయించి రీసెర్చ్ను పెద్దఎత్తున ప్రోత్సహించాలని సీఎంని కోరుతున్నా. వచ్చే వందేళ్ల విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సిబ్బంది, వీసీని ఆదేశించాం. ప్రతి ఐదేళ్లలో యూనివర్సిటీ ఏం సాధించాలనేది అందులో స్పష్టంగా ఉండాలని, స్టూడెంట్స్ ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కే రామ్మోహన్ నాయుడు, భారతరత్న, ప్రముఖ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఒడిశా గవర్నర్ కే హరిబాబు, కేంద్రమంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, సైయెంట్ గ్రూప్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్రెడ్డి, ఏయూ వైస్ ఛాన్స్లర్ జీపీ రాజశేఖర్, ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.















