- సొంత జిల్లాలో హత్య జరిగితే ఆయన వెళ్లి పరామర్శించలేదు
- జగన్ కనుసన్నల్లోనే పెద్దదస్తగిరి హత్య జరిగింది
- అధికారం కోల్పోయి రెండేళ్లవుతున్నా వైసీపీ పద్ధతి మార్చుకోలేదు
- గతంలో వివేకా హత్యను చంద్రబాబుపై నెట్టినట్టే ఇప్పుడు దస్తగిరి కేసులోనూ కుట్రలు చేస్తున్నారు
- రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మంగళగిరి (చైతన్యరథం): “యూజ్ అండ్ కిల”.. ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్ అని రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచక రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముఖ చిత్రం ‘యూజ్ అండ్ కిల’ అని విమర్శించారు. అధికారం కోల్పోయి రెండేళ్లయినా వైసీపీ నాయకుల ఆగడాలు తగ్గలేదని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నడుపుతూ రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. కడపలో జరిగిన పెద్ద దస్తగిరి హత్య జగన్రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న దస్తగిరిని భూ లావాదేవీల గొడవల్లో భాగంగా వైసీపీ ముఠాలే అంతం చేశాయన్నారు. దస్తగిరి ఇంట్లో జరిగిన పోలీసుల తనిఖీల్లో వందల కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయని, అందులో రవీంద్రనాథ్ రెడ్డి, అతని భార్య, కుమారుడి పేర్లు ఉండటం వైసీపీ ముఠాల భూ దోపిడీకి సజీవ సాక్ష్యాలని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడ చిన్న సంఘటన జరిగినా ‘దండయాత్ర’ చేసే జగన్ తన సొంత జిల్లాలో తన ముఖ్య అనుచరుడు హత్యకు గురైతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నాడు బాబాయి వివేకాను చంపి చంద్రబాబుపై నిందలు వేసి ‘నారాసుర రక్త చరిత్ర’ అని ప్రచారం చేసినట్టే.. ఇప్పుడు దస్తగిరి హత్యను కూడా కూటమి ప్రభుత్వంపై నెట్టాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వంటి వారిని ప్రోత్సహించడం జగన్ నైజమని… వైసీపీకి నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అరెస్ట్ అయిన అనంతబాబును తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు భూకబ్జాలు చేసి కట్టిన ప్యాలెస్లు, దౌర్జన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. భూములు కోల్పోయిన వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. “నేర సామ్రాజ్యాలు స్థాపించడం జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది… అందుకే రాయలసీమలో వైసీపీ భూస్థాపితమైంది.. అరాచక రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఇక నమ్మరు” అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.















