ప్రాజెక్టుల నిర్వహణలో పీపీపీలది సక్సెస్ ఫార్ములా
యువ పారిశ్రామికవేత్తలకు ఏపీ రెడ్కార్పెట్
సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు
హైదరాబాద్ (చైతన్య రథం): మూడు దశాబ్దాల క్రితంనాటి విజన్ ఇప్పుడు ప్రతిఫలాలు ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో అమలు చేసిన ఐటీ, టెక్నాలజీ, విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు ప్రయోజనాలను దక్కేందుకు కారణమవుతున్నట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఈవో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్`2026, ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ’ అనే అంశంపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న అప్పటి ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నామన్నారు. ఐటీకి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే బెంగుళూరు, చెన్నైలాంటి నగరాలను వదిలి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లోకి అడుగుపెట్టిందన్నారు. ఐఎస్బీ, జీనోమ్ వ్యాలీలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలవల్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఫార్మా రంగంలోనూ నెంబర్ వన్గా ఉన్నాయన్నారు. కరోనా సమయంలోనూ ప్రపంచానికి హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ వ్యాక్సీన్ అందించిందన్నారు. రాజకీయ కారణాలవల్ల ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
ఇప్పుడు ఇక క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా కార్యాచరణ చేస్తున్నామని సీఎం వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియాలాంటి రంగాలు విద్యుత్ రంగాన్ని శాసిస్తాయని, సుస్థిర విద్యుదుత్పాదనతో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాబోదన్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందని.. ఈ కారణంగానే పైప్డ్ నాచురల్ గ్యాస్ సరఫరా కీలకంగా మారిందన్నారు. యుద్ధానంతర పరిస్థితులరీత్యా వివిధ అంశాల్లో మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాల్సిన అంశాలు తలెత్తాయన్నారు. దక్షిణ భారత్లోనే గ్రీన్ ఇంధనం ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏఐలాంటి టెక్నాలజీ ద్వారా తిరుమలలాంటి పుణ్యక్షేత్రాల్లో దర్శనాల కోసం వేచి ఉండే సమయాన్ని కుదించగలిగామని, వేగంగా దర్శనాలు చేయించే సామర్ధ్యాన్ని 15నుంచి 20శాతానికి పెంచగలగామన్నారు. ఆధునిక ల్యాబ్ ద్వారా ప్రసాదం తయారీలో వినియోగించే పదార్ధాలను నిత్యం పర్యవేక్షిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలోలా కల్తీ నెయ్యి వినియోగించేందుకు ఇక ఆస్కారం ఉండబోదన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం తెలుసుకునేలా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామన్నారు. త్వరలో ఏఐ డాక్టర్ సేవలతోపాటు రైతులకు ఉపకరించేలా ఏఐ ఆగ్రానమిస్ట్ సేవలు అందించబోతున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు.
యువపారిశ్రామికవేత్తలకు ఏపీ స్వాగతం
పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయని.. గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం అమరావతికి టెక్నాలజీ అనుసంధానించి స్మార్ట్ సిటీగా బ్లూ గ్రీన్ రాజధానిగా నిర్మిస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు, పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని వివరించారు. గోదావరిలో వచ్చే 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాలకు కూడా ప్రయోజనాలు కలిగేలా చేయవచ్చన్నారు. ఏపీలో మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని సీఎం వివరించారు. త్వరలోనే క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన పరికరాల తయారీ కూడా చేసేలా ప్రణాళికలు చేశామన్నారు. ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని.. రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశామన్నారు. వ్యవసాయం, సేవలరంగం, పారిశ్రామికరంగం అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు రూపొందించుకున్నామని వివరించారు. ఉద్యాన, ఆక్వా రంగాల్లో కూడా ఎగుమతుల ద్వారా వృద్ధి సాధించేలా చర్యలు చేపట్టామని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యువ పారిశ్రామికవేత్తల అవసరం చాలా ఉందని.. దీనిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విజన్ డాక్యుమెంట్ రూపోందించామని.. 15 శాతం వృద్ధి రేటు నిలకడగా కొనసాగేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
పీపీపీలది సక్సెస్ ఫార్ములా
ఆర్ధిక సంస్కరణలు అందిపుచ్చుకుంటూ పీపీపీ విధానంలో జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టు చేపట్టామని సీఎం వెల్లడించారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఆస్తి మళ్లీ ప్రభుత్వానికి తిరిగివచ్చిందని సీఎం అన్నారు. చాలా రంగాల్లో ఇదే సక్సెస్ ఫార్ములాగా మారిందన్నారు. భారత్లో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు ఇలా వేర్వేరు ప్రాజెక్టులు విజయం సాధించాయన్నారు. వేర్వేరు సంస్కరణల ఫలితంగా సంపద పెరిగిందని.. అదే సమయంలో సమాజానికి వెనక్కి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గిరిజనులు పండించే అరకు కాఫీని మార్కెటింగ్ చేసేందుకు గతంలో నాందీ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని.. ఇప్పుడు దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే బాధ్యతను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తీసుకున్నారని వెల్లడించారు. సమాజంలో అట్టడుగున ఉండిపోయిన పేదవారిని ఆదుకునేందుకు పీ`4 ఎంబీకే 10-20 కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. పేదలకు చేయూత అనేది చాలా కీలకమని తద్వారా వారు సామాజికంగా ఆర్ధికంగా పైకి ఎదగగలుగుతారని సీఎం వివరించారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. 2047 తర్వాత భారత్లోనూ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. దక్షిణ భారత్లోనూ ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించామన్నారు.
గత పాలనలో అంతా విధ్వంసమే
2024లో మళ్లీ తాము అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ అంతా సర్వనాశనమైందని, గత పాలకుల ఐదేళ్ల పాలనా కాలంలో బ్రాండ్ పోయిందని.. వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని అన్నారు. రాష్ట్ర విభజనకంటే దారుణగా రాష్ట్ర పరిస్థితి తయారైందన్నారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని.. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక కొన్ని ప్రోగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుని సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం పెట్టుబడుల్ని ఆకర్షించటంలో ఏపీ ఆగ్రస్థానంలో ఉందని వివరించారు. గతంలో అమరావతి నిర్మాణం జరుగుతుండగా గత పాలకులు శ్మశానం అని గేలిచేసి విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఇప్పుడు మళ్లీ దానిని పునర్నిర్మిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా 2019 వరకూ 72 శాతం పనులు పూర్తి చేశామని.. గత పాలకులు పట్టించుకోక విధ్వంసం చేశారన్నారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రాం వాల్ ధ్వంసమైందని, మళ్లీ అదే పనిని రూ.వెయ్యి కోట్లతో చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
సమ్మిట్లో చంద్రబాబు విజన్ ప్రజెంటేషన్
ఈఓ సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్ 2026లో హైదరాబాద్ను హైటెక్ సిటిగా మలిచిన తీరుపై నిర్వాహకులు వీడియోను ప్రదర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దటంలో చంద్రబాబు విజన్ను నిర్వాహకులు వీడియోలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారంటూ దాంట్లో పేర్కొన్నారు. 1995నుంచి హైటెక్ సిటీ నిర్మాణం, జీనోమ్ వ్యాలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైక్రోసాఫ్ట్లాంటి కంపెనీల రాక అంశాలను ప్రస్తావిస్తూ వీడియో ప్రదర్శించారు. ప్రస్తుతం క్వాంటం వ్యాలీ, ఏఐపై ఏపీ ఫోకస్ పెట్టిందంటూ ఇచ్చిన ప్రజెంటేషన్ సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్కు హాజరైన పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది.

















