- కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి
- పోలవరం రెండో దశకు నిధులివ్వండి
- ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50శాతం రాయితీపై కంటైనర్లు
- ఉత్తర- దక్షిణ భారత్ను కలుపుతూ ప్రైట్ కారిడార్ల నిర్మాణం
- ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి
- పూర్వోదయ సహా కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులివ్వాలి
- రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సహకారం కోరిన చంద్రబాబు
- హోంమంత్రి షా సహా ఏడుగురు మంత్రులతో సీఎం వరుస భేటీలు
ఢిల్లీ (చైతన్య రథం) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వీటితోపాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్ర హోంమంత్రి సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉదయం 10గంటలనుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. అమిత్ షాతో సహా కేంద్రఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన సీఎం.. పూర్వోదయ పథకం ద్వారా రాయలసీమను ఉద్యాన హబ్ గా మార్చే ప్రణాళికకు నిధులివ్వాలని కోరారు. అలాగే వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర వాటాను విడుదల చేయాలనీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో సమావేశమైన సందర్భంలో.. ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. మఖానా సాగుకు ఏపీలో అనుకూల మైన పరిస్థితులు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.
కొల్లేరు ప్రాంతంలో 50వేల ఎకరాల్లో మఖానా సాగు చేసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రితో సీఎం చర్చించారు. పిఎం ప్రణామ్ పథకం కింద ఏపీలో సామూహిక సహజ వ్యవసాయాన్ని విస్తరించేందుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరారు. ఈ పథకం కింద గత ఏడాది రసాయన ఎరువుల వాడకం తగ్గించిన రాష్ట్రంగా ఏపీకి రూ.216 కోట్లమేర ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని అడిగారు. ఏపీలో కొబ్బరి సాగు విస్తృతికి వీలుగా రూ.200 కోట్లమేర సాయం అందించాలనీ సీఎం కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు అధునాతన పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.695 కోట్లను విడుదల చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్ తోతాపురి మామిడి రైతులకు కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్లను విడుదల చేయాలని సీఎం కోరారు.
పోలవరం రెండోదశకు రూ.32 వేల కోట్లు అవసరం
పోలవరం ప్రాజెక్టు రెండోదశలో భాగంగా తదుపరి భూసేకరణ, పునరావాసానికి నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. దీనికోసం రూ.32 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని
కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాల్వల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్సు చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం -నల్లమల సాగర్ లింక్ ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేయాలని అభ్యర్థించారు.
జాతీయ నదుల అనుసంధాన విధానం
లో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక-ఆర్థికసాయం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్- ఒడిశామధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించేలా వంశధార నీటి వివాద (ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్లో ప్రచు రించాలన్నారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ- తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్న తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణా టక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడంవల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రి పాటిల్కు సీఎం చంద్రబాబు వివరించారు.
సరకు రవాణా కారిడార్లు అవసరం
ఉత్తర-దక్షిణ భారత్ను అనుసంధానిస్తూ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర-దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని.. పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగూర్-చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ (ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయటంతోపాటు కొత్త రైలు మార్గాలు, సర్వీసులను నడపాలని విజ్ఞాపన పత్రం ఇచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే విశాఖలో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయని.. జీఎం సహా ఇతర అధికారులు విధుల్లో ఉన్నారని తెలియచేశారు.
అలాగే రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలోనూ ఇదే తరహా రాయితీపై రీఫర్ కంటైనర్లను కేటాయిస్తున్నారని, అదే రాయితీని ఏపీకీ పొడిగించాలని కోరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ- విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి- చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలని సీఎం కోరారు.
హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వేలైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని.. తిరుపతిమీదుగా విజయవాడ- బెంగుళూరు మధ్య వందేభారత్ సర్వీసును నడపాలని రైల్వే మంత్రికి ఇచ్చిన లేఖలో సీఎం పేర్కొన్నారు. వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతోపాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇటీవల కేంద్ర బడ్జెట్టులో ప్రతిపాదించిన వివిధ హైస్పీడ్ రైళ్ల కారిడార్లల్లో ఏపీని కనెక్ట్ చేసేలా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలని అశ్వినీ వైష్ణవ్ను సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్కు సహకరించండి
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్గా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం చంద్రబాబు వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద రూ.276కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్కు కార్యాచరణ రూపొందించామన్నారు. కేంద్ర వాటా కింద రూ.105 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ఎ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ప్లాంట్ లాభాలబాట పట్టడంలో అందించిన సహకారానికి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు- ఉద్యోగుల పట్టుదల, శ్రమతో ఈ లాభాలు సాధ్యమయ్యాయని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు సాధించడంతోపాటు, పూర్తిస్థాయి సామర్థ్యంమేర పనిచేస్తోందని సీఎం తెలిపారు. ఆర్ఎన్ఎల్ విషయంలో భవిష్యత్లోనూ ఇంతే తోడ్పాటు, సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబువెంట కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు, వివిధ శాఖల ఉన్నతాధికారు ఉన్నారు.














