- రూ.50 కోట్లతో ఏపీ ఎన్నార్టీ కార్పస్ ఫండ్
- విదేశీ విద్య కోసం ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు
- జన్మభూమిని మరిస్తే చరిత్ర హీనులే
- అదే సమయంలో కర్మభూమికి సేవలందించాలి
- జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- 20 దేశాల నుంచి కుటుంబాలతో హాజరైన తెలుగు ప్రజలు
- తెలుగు కుటుంబాలను ఆత్మీయంగా పలకరించిన సీఎం చంద్రబాబు
జ్యూరిచ్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు (ఎన్నార్టీలు) ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచనలు చేస్తే… ఉద్యోగాలు చేసే ఎన్నార్టీలు పారిశ్రామిక వేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. దావోస్ తొలిరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…దావోస్కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు తక్కువగా ఉన్నారు… తెలుగు వాళ్లు అసలు లేరన్నారు. ప్రస్తుతం జ్యూరిచ్లో పరిస్థితి చూస్తుంటే ఉన్నది విజయవాడలోనా.. తిరుపతిలోనా అన్నట్లుగా ఉంది. 20 దేశాల నుంచి తెలుగువారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారు…148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్నా తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. విజన్ 2020, ఐటీ గురించి నేను మాట్లాడిన రోజుల్లో అందరూ విమర్శించారు. కానీ నేను ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగు వారు వెళ్లడానికి అవకాశం వచ్చింది. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం గర్వకారణం. 2047కు భారత దేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీ దేశంగా అవతరిస్తుంది. భారత దేశానికి అత్యంత బలమైన నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో ఉంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని… యువకులను పార్టీలో, ప్రభుత్వంలో ప్రోత్సహిస్తున్నాం. అందుకే లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారికి పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో యువ కెబినెట్ మంత్రి అని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎన్నికల్లో ఎన్నార్టీల సహకారం మరవలేం
సవాళ్లను ఎదుర్కోవాలి… ఇబ్బందులను అధిగమించాలి… దీన్ని యువత అందిపుచ్చుకోవాలి. పదవులు వస్తే గ్లామరే కాదు… రాళ్లు కూడా పడతాయి. వీటిని ఎదుర్కొనడం యువత అలవరచుకోవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీలు అద్భుతంగా పని చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారు, బీజేపీ కలిసి వచ్చింది. రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలి… సహకరించమని ఎన్నార్టీలను కోరితే క్షణం కూడా ఆలోచించకుండా తరలి వచ్చారు… కూటమి కోసం పని చేశారు. రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలతో సమానంగా కొందరు ఎన్నార్టీలు కూడా కేసులు పెట్టించుకున్నారు. ప్రజల ఆశీస్సులు, మీ సహకారంతో 93 స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడం సాధ్యమా… అని అందరూ ఆందోళ చెందారు. కానీ 18 నెలల కాలంలో ఏపీ బ్రాండ్ పునరుద్దరించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పని చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో మంత్రులు, నేను పోటీ పడుతూ పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. అలాగే దేశానికి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి గూగుల్ రూపంలో ఏపీకే వచ్చింది. ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తోంది. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాను. ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేసేలా పరిశ్రమలు స్థాపిస్తున్నాం. అలాగే తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నాం. విద్యుత్ విషయంలో సంస్కరణలు చేపట్టడం వల్ల డేటా సెంటర్లు రాష్ట్రానికి వస్తున్నాయి. మొత్తంగా రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నాం. ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలం. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చి విదేశాల్లో స్థిరపడ్డారు… మీ ఊళ్లల్లో ఉన్న వారిని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా చేసి అభివృద్ధి చేస్తున్నాం. యూరప్లో లిచైîన్ స్టైన్ చాలా చిన్న దేశం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్లే లిచైîన్ స్టైన్ సంపన్న దేశంగా ఎదిగింది. అందుకే ఏపీలోనూ క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నాం. డ్రోన్ల ద్వారా ప్రజలకు, వ్యవసాయ, వైద్య రంగాలకు సేవలు అందించేలా చూస్తాం. డ్రోన్ ఆపరేషన్లకు పర్మిషన్లు ఇచ్చే బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని కోరుతున్నాను. ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైసెస్, ఫార్మా రంగాల అభివృద్ధిపై రాష్ట్రం దృష్టి సారించింది. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్యం మెరుగయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నీటి భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఏపీ రిజర్వాయర్లలో 958 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఏఐకు చిరునామాగా భారతీయులు, తెలుగు వాళ్లే ఉన్నారు. దీన్ని అందిపుచ్చుకుని మరింత అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఒకరు ఉద్యోగం… మరొకరు వ్యాపారం
జన్మభూమిని మరిచిపోతే చరిత్ర హీనులవుతారు. అలాగే కర్మభూమికి సేవలు అందించాలి. విదేశాల్లో ఉద్యోగాల కోసం వచ్చే వాళ్లు అక్కడి స్థానిక పరిస్థితులతో కలిసిపోవాలి. ఏ ప్రాంతంలో ఉంటే.. ఆ ప్రాంతంలోని స్థానికులతో మమేకం కావడమనేది తెలుగు వారి ప్రత్యేకత. ఉద్యోగాలు చేసే వాళ్లుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్లుగా తెలుగు జాతి ఎదగాలి. ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తాం. ఒన్ ఫ్యామిలీ-ఒన్ ఎంటర్ప్రెన్యూయర్ అనేది ప్రభుత్వ విధానం. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్లల్లో భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే… ఒకరు ఉద్యోగం చేయండి… మరొకరు వ్యాపారం చేయండి. ఏపీలో వ్యాపారాలకు, పరిశ్రమలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగంలోకి రావాలనుకున్న ఎన్నార్టీలకు సహకరిస్తాం. విదేశాల్లోనూ వ్యాపారాలు చేసుకుంటామంటే చేయండి.. ఏపీలో పెట్టుబడులు పెడతామన్నా స్వాగతిస్తాం. ఎన్నార్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తూ రూ. 50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి ప్రభుత్వం తరపున సహకరిస్తాం.. గైడ్ చేస్తాం. కొంచెం కొత్త తరహాలో ఆలోచన చేస్తే పారిశ్రామిక వేత్తలుగా రాణించగలరు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని కో-ఆర్డినేట్ చేసి.. వారిని అభివృద్ధి చేసేలా… పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారు బాధ్యత తీసుకోవాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని స్థాపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
విదేశీ విద్య… మా బాధ్యత
చదువు కోవాలని అనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మంచి యూనివర్శిటీలు ఎక్కడున్నా విద్యార్థులకు అవకాశాలు అందేలా చేస్తాం. 4 శాతం వడ్డీతో రుణాలు ఇప్పించి విదేశీ విద్య అందించేలా మేం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తాం. ఏపీ ఫస్ట్ అనే అతి పెద్ద రీసెర్చ్ వ్యవస్థను తెస్తున్నాం. ఐఐటీ-ఐఐఎసఈఆర్ కాంబినేషన్తో ఈ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో స్థాపిస్తున్నాం. కొత్త ఆవిష్కరణలతో యువతకు ఉపాధి చూపించేలా కృషి చేస్తున్నాం. 2047 నాటికి దేశం అగ్రభాగాన నిలుస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 కావాలి.. తెలుగు జాతి వెలగాలి. 30 ఏళ్లకు ముందు భారత దేశం గురించి ప్రత్యేకంగా చర్చించుకునే వారు కాదు… కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఇందులో మనం భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.













