- రాష్ట్రంలో క్వాంటం స్కిల్ రోడ్ మ్యాప్ సిద్ధం
- రెండేళ్లల్లో అమరావతినుంచే క్వాంటం పరికరాల ఉత్పత్తి
- క్వాంటం విజన్ ను, విప్లవాన్ని అందిపుచ్చుకోండి
- ఈ టెక్నాలజీతో నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి
- “క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్”లో చంద్రబాబు లెక్చర్
- వివిధ అంశాలపై టెకీ స్టూడెంట్సు సీఎం ప్రజెంటేషన్
అమరావతి (చైతన్య రథం): భారత్ దేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం సహా దాని అనుబంధ రంగాల్లో నిపుణులను తయారు చేసేలా తాము కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన క్వాంటం ప్రోగ్రామ్లో భాగంగా
వేలమంది టెక్ విద్యార్థులతో ముఖ్యమంత్రి ‘క్వాంటం టాక్ బై సీబీఎన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా కార్యక్రమంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విజన్ను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. క్వాంటం ప్రోగ్రామ్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వేలమంది విద్యార్ధులు కార్యక్రమానికి హాజరయ్యారు.
అలాగే అమెరికానుంచి వైసర్ సంస్థ ప్రతినిధులు, క్యూబిట్, ఐబీఎం సంస్థల ప్రతినిధులతోపాటు ఆంధ్రా యూనివర్సిటీ సహా వేర్వేరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్దఎత్తున హాజరయ్యారు. క్వాంటం మెకానిక్స్, అల్గారిథమ్స్ లాంటి అంశాల్లో 10 లక్షలమంది నిపుణుల్ని, క్వాంటం సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్డ్ రీసెర్చిలో లక్షమంది. నిపుణుల్ని తయారు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఏపీలో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించాం. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హల్గా ఎదిగింది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ అరవింద్ కృష్ణలాంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించాం. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్ గా మారుతోంది. ఇక్కడి నుంచే సబ్ సీ కేబుల్ లాంటి వ్యవస్థ సైతం ఏర్పాటవుతోంది. అమరావతి నాలెడ్జి ఎకానమీ, క్వాంటం వ్యాలీగా ఉంటుంది.
తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితమవుతుంది. అనంతపురం, కడపలాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయి. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయి. ఏపీని క్వాంటంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నాం. వచ్చే 20 ఏళ్లలో చేపట్టాల్సిన రాష్ట్రాభివృద్ధికి ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా ఎకో సిస్టమ్ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భారత్లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ, క్వాంటం రంగంలో మరింత పెట్టుబడులు రావాల్సి ఉంది. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా పెద్దఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పనకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవంలాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటం విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉంది. వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వెదర్ ఫోర్కాస్టింగ్లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలు మానవాళికి ఉపకరిస్తాయి. ఏఐ, క్వాంటం, శాటిలైట్, డ్రోన్లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చు. క్వాంటం టెక్నాలజీ ద్వారా పరిశోధనలకు ఆకాశమే హద్దు” అని -ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మన పరిశోధనలు నోబెల్ స్థాయికి చేరేలా..
“ఏపీనుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వందకోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వంద కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మన పరిశోధనలు ఆ స్థాయిలో ఉండేలా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఉపకరిస్తుంది.అందుకే అమరావతిలో క్వాంటం ఎకో సిస్టం వచ్చేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యు రేటివ్ హెల్త్ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సామర్థ్యాలు, వేగం, కచ్చితత్వంలాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించవచ్చు. వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను క్వాంటం ద్వారా సాధించవచ్చు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఏ సాంకేతికత అయినా, విప్లవమైనా ఏపీ నాయకత్వం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతినుంచే ఉత్పత్తి చేస్తాం. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీనుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం.
క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాం. లక్షమంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్థులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు. విజను అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరుతున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్, అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
మూడు దశాబ్దాల క్రితమే ఐటీ విజన్ విప్లవాత్మక మార్పు
“25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీలాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. విజ్ఞానం భారతీయుల
డీఎన్ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారు. ఆయుర్వేద,
తక్షశిల, నలంద యూనివర్సిటీలు, సిల్క్ రూట్లాంటి. అంశాలే దీనికి నిదర్శనం. గణితంలో జీరోను,
అడ్వాన్స్డ్ అస్ట్రానామీలాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారు. 2 వేల ఏళ్ల
క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్నుంచే వచ్చేది. ఇప్పుడు 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవంకంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవలరంగంలో విప్లవం సాధించాం.
వైద్యులు, ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీలాంటి సంస్కరణలతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే. వారిలోనూ ఏపీనుంచి వెళ్లిన వారే ఎక్కువ. ఇప్పుడు మన యువత భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యంతో మనదేశం అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. 30 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా భారత్ తయారవుతుంది. టెక్నాలజీ, ఇన్ఫ్రా డ్రివెన్, సస్టెయినబుల్, ఫ్యూచర్ రెడీ ఎకనామీగా భారత్ ఎదుగుతుంది” అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.కార్యక్రమానికి ఐఐటి మద్రాస్, ఐఐటి తిరుపతి డైరెక్టర్లు ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ కామకోటి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ సహా వివిధ సంస్థల నిపుణులు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీ ప్రోగ్రామ్ను సమర్థంగా నిర్వహిస్తోన్న ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్నలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.














