- అటల్ అంటేనే నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన
- తెలుగుజాతి ఆయనకు రుణపడి ఉంటుంది
- నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు వాజ్పేయి
- ఆర్థికంగా ఎదగడమే కాదు.. నైతిక విలువలూ ముఖ్యం
- మచిలీపట్నంలో అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్రలో మంత్రి లోకేష్ ఉద్ఘాటన
- భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ
మచిలీపట్నం (చైతన్యరథం): జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప నేత అటల్ బిహారీ వాజ్పేయి.. అటల్ అంటేనే నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అనతంరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఈ నెల 25న అమరావతిలో యాత్ర ముగుస్తుంది. అటల్ జీ గొప్పదనమే కాదు.. ఆయన సమాజానికి చేసిన సేవ, ఆయన నైతిక విలువలపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబులో ఎవరిని మీరు ఆదర్శంగా తీసుకుంటాని నన్ను చాలా మంది అడిగారు. అయితే ఒక మత్స్యకార గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆనాటి సింగపూర్ ప్రధాని లీ క్వాన్ యూ, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందుగా తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్ పేయిని తాను ఆదర్శంగా తీసుకున్నానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన
సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు మేము కృషి చేస్తున్నాం. అసలు సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి. ఆయన గురించి ఎవరిని అడిగినా గొప్పగా చెబుతారు. ప్రత్యర్థులే లేని వ్యక్తి వాజ్ పేయి. చిన్నవయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేశారు. 18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం కోసం జైలుకు వెళ్లారు. అటల్ బిహారీ వాజ్ పేయి అంటేనే నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన. ఆయన మూడుసార్లు ప్రధాని అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులే ప్రధానిగా ఉన్నారు. సాధారణంగా నాయకులు మెజార్టీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనైనా మద్దతు కూడగట్టుకోవాలని కోరుకుంటారు. కానీ వాజ్ పేయి మాత్రం నైతిక విలువల కోసం నిలబడ్డారు. తర్వాత ఆయనకు తిరుగే లేకుండా పోయిందని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
దేశ భద్రత, అభివృద్ధికి కృషి
వాజ్ పేయి హయాంలో పోఖ్రాన్లో అణు పరీక్ష నిర్వహించారు. దేశ భద్రత కోసమే అణు పరీక్ష అని చెప్పిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి. కార్గిల్లో పాక్ దురాక్రమణను సమర్థంగా తిప్పికొట్టారు. ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓ వైపు దేశభద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, మరోవైపు అభివృద్ధిలోనూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. స్వర్ణ చతుర్భుజి తీసుకువచ్చారు. అద్భుతమైన రోడ్లు వేశారు. చంద్రబాబు కోరితే టెలికాం మొత్తం డీ రెగ్యులరైజేషన్ చేశారు. అహర్నిశలు కష్టపడి సంస్కరణలు తీసుకువచ్చారు. నేడు దేశంలో అద్భుతమైన ఎయిర్ పోర్టులు చూస్తున్నామంటే కారణం అటల్ బిహారీ వాజ్ పేయి సంస్కరణలే అని మంత్రి లోకేష్ అన్నారు.
తెలుగుజాతి రుణపడి ఉంటుంది
దేశాన్ని, హిందీని ఎల్లప్పుడూ ప్రేమించేవారు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడి స్టాండిరగ్ ఓవేషన్ పొందిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి. ఆయనను కలిసే అవకాశం నాకు దక్కలేదు. ఆయన గురించి చంద్రబాబు వద్ద తెలుసుకున్నాను. వారిద్దరి మధ్య ప్రేమ చూస్తే ఒక తండ్రికి, కుమారుడికి మధ్య ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢల్లీికి వెళితే.. కుమారుడు వస్తే తండ్రి ఎంత సంతోషపడతారో ఆ విధంగా వాజ్ పేయి ఆనందపడేవారు. 1998లోనే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిరది. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధికి కారణం వాజ్ పేయి. ఐఎస్బీ సంస్థ కావాలని చంద్రబాబు కోరితే కలిసికట్టుగా తీసుకువచ్చారు. బీమా నియంత్రణ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. హైదరాబాద్లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ నిర్వహణకు నిధులు కేటాయించిన వ్యక్తి వాజ్ పేయి. తెలుగుజాతి ఆయనకు రుణపడి ఉంటుంది. ఇండియా ఫస్ట్ అనేది వాజ్ పేయి ఆలోచన. దేశాన్ని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధానిగా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు. ఏనాడూ అధైర్యపడలేదు. కలిసికట్టుగా ముందుకు వెళదామని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి లోకేష్ చెప్పారు.
వాజ్ పేయి మార్గంలోనే ప్రధాని మోదీ..
వాజ్ పేయి మార్గంలోనే ప్రస్తుత ప్రధాని మోదీ వెళ్తున్నారు. మోదీకి కూడా యువకులంటే చాలా ఇష్టం. వారికి అండగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పొరుగుదేశానికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే.. ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోంది. మోదీని మనం నమో అని కూడా పిలుస్తాం. నమో అంటే నాయుడు, మోదీ జోడీ నడుస్తోంది. గడిచిన 18 నెలల్లో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయంటే, ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందంటే 2024 ఎన్నికల్లో అందరం కలిసి సాధించుకున్న విజయమే కారణం. 175 స్థానాల్లో 164 స్థానాల్లో కూటమి గెలిచింది. ఒక పవిత్ర బాధ్యత మా భుజస్కందాలపై ఉంది. మేం అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి దారిలో పెడతాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
నైతిక విలువలూ చాలా ముఖ్యం
ఏ మార్గం అయితే వాజ్ పేయి మనకు చూపించారో ఆ మార్గంలో మనం నడవాలి. ప్రధాని మోదీ 2047 నాటికి దేశం అభివృద్ధి సాధించాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఎదగడమే కాదు.. నైతిక విలువలు కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువల గురించి బోధిస్తున్నాం. నైతిక విలువలు లేని సమాజం సమాజమే కాదు. అందుకే వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు పెంచుకోవాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. వాజ్ పేయి మొదటి విగ్రహం మంగళగిరిలోనే ఏర్పాటు చేస్తామని కోరాను. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వాజ్ పేయి పెద్ద విగ్రహం మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తాం. నాకు స్ఫూర్తిని ఇచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి. నేను పట్టుదల, కమిట్ మెంట్తో పనిచేస్తున్నానంటే కారణం వాజ్ పేయి. ఆయన మార్గంలోనే నడుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి కొల్లు రవీంద్ర, శాసనమండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, బోడె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










