- రెండు దశల్లో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు
- ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, మండపాలు, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం
- మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
అమరావతి (చైతన్య రథం): అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమిపూజ జరుగనుంది. మొదటి దశలో రూ.140 కోట్లు వ్యయంతో వివిధ పనుల్ని చేపట్టనున్నారు. రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు రూ.48 కోట్లు ఖర్చుకానుంది. ఇక రెండోదశ పనులను రూ.120 కోట్లతో చేపట్టనున్నారు. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు- సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్వంటి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తైన నేపథ్యంలో నేడు శంకుస్థాపన అనంతరం రెండు, మూడవ విడత పనులు చేపట్టనున్నారు. 4వ విడత పనుల్ని కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలుస్తారు.
ఆలయ విస్తరణకు గత ప్రభుత్వంలో గ్రహణం
తిరుమల తరహలో రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నది తీరాన అత్యద్భుతంగా వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి 25.417 ఎకరాలు కేటాయించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గత పాలకులు ఆలయ విస్తీర్ణాన్ని కుదించారు. కేటాయించిన భూమిలోనూ కోత పెట్టడంతో పాటు విస్తరణ పనులు రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి దేవాలయం విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.











