- నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్
- ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు కృషి
- మంగళగిరి నా కుటుంబంలా మారిపోయింది
- మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి మాట్లాడతారు.. కానీ బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడరు.. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ నెల 26న జరిగే స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీకనకపుట్లమ్మను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసానికి మంగళవారం సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. మంగళగిరి బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది.
నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువశక్తి గురించి మాట్లాడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. అమ్మకు చెప్పకూడని పనులు చేయకూడదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సోమవారం జరిగిన విలువల విద్యాసదస్సు కార్యక్రమంలో ఉద్బోధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తాం. విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులుగా మారాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ప్రతి ఏడాది స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం. మిమ్మల్ని చూసి మరో పదిమంది విద్యార్థులు స్ఫూర్తి పొందుతారని మంత్రి అన్నారు. బుధవారం జరిగే మాక్ అసెంబ్లీలో మాకేమైనా సలహాలు, సూచనలు ఇస్తున్నారా అంటూ విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మను ఉద్దేశించి మంత్రి చమత్కరించారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరవుతున్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికకావడం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని విద్యార్థిని పేర్కొన్నారు. గతంలో కంటే ప్రభుత్వ పాఠశాలలో భోజనం బాగుంటోందని తెలిపారు. మంత్రి స్పందిస్తూ.. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మంగళగిరి నా కుటుంబంలా మారిపోయింది
ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి 11వ వార్డులో నివాసం ఉండే విద్యార్థిని తండ్రి రాము పుట్టుకతో దివ్యాంగుడు. ట్రై స్కూటీిపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని, తనకు రూ.6వేల పెన్షన్ వస్తోందని విద్యార్థిని తండ్రి రాము తెలిపారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి తన కుటుంబంలా మారిపోయిందని, మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ను కలవడం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.












