- ప్రతి విద్యార్థి బ్లడ్ శాంపిల్స్… హాస్టల్లో వాటర్ శాంపిల్స్ తీసుకోండి
- విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం పెరిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలి
- సంక్షేమ శాఖలకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం
- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ తమ విధి నిర్వహణలో భాగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు… రెసిడెన్షియల్ స్కూళ్లల్లోని నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… ‘‘సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం నూటికి నూరుశాతం నిర్వహించాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావృతమైతే… ఏం జరిగిందని తెలుసుకునేది ఉండదు. నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 20 శాతం హాస్టళ్లల్లో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరపాల్సి ఉంది. ఈ టాయిలెట్ల నిర్మాణం కోసం అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేస్తాం. టాయిలెట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండడం సరి కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంవల్ల ఇవన్నీ జరిగాయి. ఆర్వో ప్లాంట్లు లేని ప్రతి హాస్టల్లోనూ… ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. డాక్టర్లతో విద్యార్థులకు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించాలి. హాస్టళ్లలోని 4.17 లక్షలమంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి సమస్యలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్సలు అందించాలి. బడుగు విద్యార్థులకు చేసే సాయాన్ని బాధ్యతగా తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో హాస్టళ్లు పెట్టారు. దీనికి విఘాతం కలిగించేలా అలక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదు. హాస్టళ్లల్లో పరిస్థితి పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనల చేపట్టడంతో పాటు… పరిస్థితులపై నిత్యం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలి.
ప్రతివారం ఆర్వో ప్లాంట్ల ఆడిటింగ్
‘‘సంక్షేమ రంగానికి చెందిన శాఖలన్నీ కలిపి ఉమ్మడిగా ఓ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని హాస్టళ్లల్లోని విద్యార్థులకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వైద్య పరీక్షలు నిర్వహించే సందర్భంగా విద్యార్థుల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే… వాటి మూలాలను విశ్లేషించి, తదనుగుణంగా వైద్యం అందేలా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం పెరిగేలా ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించండి. బాలుర హాస్టళ్ల విద్యార్థులకు మగ కౌన్సిలర్లు, బాలికల హాస్టళ్లలోని విద్యార్థినులకు మహిళా కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ఆత్మస్థయిర్యంతో నిలబడగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. హస్టళ్లల్లో నీటి సరఫరా విషయంలో పంచాయతీరాజ్, హెల్త్, మున్సిపల్ శాఖలు, సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు కలిసి పని చేయాలి. అన్ని హాస్టళ్లల్లో వాటర్ శాంపిల్స్ తీసుకోండి. ఎనిమియా, సికెల్ సెల్ వ్యాధులపై అవగాహన కల్పించే బాధ్యతను అధికారులపైనే ఉంది’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












