- వ్యవసాయ పంచసూత్రాలపై వారంపాటు అవగాహన
- అగ్రిటెక్పై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రణాళిక అమలు
- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
- 10 వేలమందికి దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలుచేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో ఈనెల 24నుంచి కార్యక్రమాలు నిర్వహించనుంది. 24నుంచి 29 వరకు ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతోపాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేలమందితో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్లో ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు.
ఈమేరకు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ‘రైతన్నా.. మీకోసం’ పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవాకేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తారు. ఈ సందర్భంగా టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…. “17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షలమందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశాం. రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించాం. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇలాంటివాటితోపాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించాం. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టాం.
ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకు అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి. దీంతోపాటు వర్షిప్లు కూడా నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి” అనిపిలుపునిచ్చారు.
ప్రకృతి సేద్యం… అగ్రిటెక్ ఫలితాలు వివరించండి
“రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ ప్రచారం చేయాలి. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు దక్కుతుంది. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల భూసార రక్షణతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నాం. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలి. కడపలో ప్రకృతి సాగును పరిశీలించాను. ఆ సాగు రైతులు చాలా సంతృప్తిగా ఉన్నాయి. ప్రైవేట్ ఎరువుల షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లోని ఎరువుల ధర తక్కువగా ఉంది.
రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుంది. రైతుల ఏపంటలు సాగు చేశారు…. వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలి. సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలి. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలను, సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది వివరించాలి. పూర్తి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా రిజర్వాయర్లను నింపగలిగాం. అలాగే సమర్ధ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతువంటి విషయాలను రైతులకు చెప్పాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెలీకాన్ఫరెన్స్లో మంత్రి అచ్చెన్నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












