- రెండవ విడతగా 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు జమ
- పీఎం కిసాన్ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రూ.5 వేలు.. మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లోకి
- కమలాపురంలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
- 10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
- రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశం
- తొలి విడతలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
- రెండు విడతల్లో రూ ..6309.44 కోట్ల మేర రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం
అమరావతి (చైతన్యరథం): రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పీఎం కిసాన్ నిధులతో కలిపి ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడతగా 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. రెండు విడతల్లో కలిపి పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు చెల్లించనున్నారు.
పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో గత ఆగస్టు నెలలో నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ నెల 19వ తేదీ వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల జమ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటన అనంతరం మధ్యాహ్నం కమలాపురం వెళ్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గోవాలని సీఎం సూచించారు. 10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఖాతాల్లో నిధుల విడుదల మాత్రమే కాకుండా… వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సీఎం సూచించారు. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.











