విశాఖపట్నం (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని భారత్ బయోటెక్ ప్రతినిధులను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ వంటి మహామ్మారి నుంచి కాపాడిన అంతర్జాతీయస్థాయి వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ మ్యానేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లాతో మంత్రి లోకేష్ శుక్రవారం విశాఖలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. దీనిపై రేచస్ ఎల్లా మాట్లాడుతూ… ప్రస్తుతం తాము మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి పాండమిక్ వ్యాధులకు వైరస్ తయారీ పై పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.
భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (కోవిడ్ ` 19), రోటావాక్ (రోటా వైరస్), టైప్ బార్ టిసివి (టైఫాయిడ్ వ్యాక్సిన్), జెన్వాక్ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వంటి వ్యాక్సిన్లను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా 80దేశాలకు సరఫరా చేస్తోంది. సుమారు రూ.3వేల కోట్ల వార్షికాదాయం కలిగిన ఈ సంస్థ వ్యాక్సిన్ల తయారీలో భారత్ లో టాప్-3లో ఒకటిగా ఉంది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాలకు ప్రధానంగా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తోంది.














