- భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
- బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): బ్రిస్బేన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ ఎం భాగోటియా, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ) ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… భారత్-ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందన్నారు. భారత్నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధిచేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా, ఇందులో ఏపీ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. 2022 డిసెంబర్లో అమలులోకి వచ్చిన ఆస్ట్రేలియా-భారత్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ) ఇరుదేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ ఛేంజర్గా మారింది. 2020-21 ఇరుదేశాల నడుమ వస్తు వాణిజ్య కార్యకలాపాలు 12.2 బిలియన్ డాలర్లు ఉండగా, 2024-25 నాటికి దాదాపు రెట్టింపై 24.10 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్లో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తోంది. ఫలితంగా గత 16నెలల కాలంలో ఏపీకి రూ.10లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఉంది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోంది. ప్రస్తుతం భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. ఏపీలో పరిశ్రమదారుల కోసం సులభతరమైన పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాం. వచ్చేనెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ `2025కి హాజరై ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను తెలుసుకోవచ్చు. అందుకు పార్టనర్షిప్ సమ్మిట్కు హాజరవ్వండి‘‘ అని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు.










