- రబీ సీజన్లో సబ్సిడీపై విత్తనాలు అందిస్తాం
- రైతు ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యం
- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
అమరావతి (చైతన్యరథం): రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా రైతుల ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కితగ్గదని స్పష్టం చేశారు. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనాలు రూపొందిస్తోందని. రైతుల అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతు కష్టపడి పండిరచే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు.రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.