- 2047నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం
- ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం
- హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లుపడితే.. విశాఖకు పదేళ్లు చాలు
- విశాఖకు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
- డేటా సెంటర్ శంకుస్థాపనలో ఐటీ మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం (చైతన్య రథం): ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని, 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన అనంతరం రిషికొండలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. “ఇక్కడున్న ఐటీ ప్రొఫెషనల్స్క, సీఈవోలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజాయతీగా చెప్పాలంటే.. 1990ల్లో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైబర్ టవర్స్ను నిర్మించారు. దీనివల్ల అనేక సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లుపైనే పట్టింది. కానీ, విశాఖ అభివృద్ధికి పదేళ్లకు మించి పట్టదు. అది మా కమిట్మెంట్. కంపెనీలు తీసుకురావడం వెనుక ఉన్న శ్రమను ప్రజలు గుర్తించాలి. సిఫీ చైర్మన్ రాజు వేగెశ్నను 2017లో మొదటిసారి కాలిఫోర్నియాలో కలిశాను. ఆ సమయంలోనే మొదలైంది ఈ ప్రయాణం. ఆయనను ఏపీలోని విశాఖకు తీసుకొచ్చేందుకు నాకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది. పెట్టుబడుల కోసం ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతోనే కాదు.. ఇతర దేశాలతో పోటీపడుతున్నాం. ఈ కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు” అన్నారు.
ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
“పెట్టుబడులు ఒక్కరోజులో రాలేదు. మంతెన రామరాజు, ఎన్ఆర్ఎ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, కాటంనేని భాస్కర్ ఈ ప్రాజెక్ట్ను విశాఖపట్నానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ప్రాజెక్ట్వైనుక ఎంతోమంది కృషి ఉంది. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. విశాఖపట్నం ఏపీకి ఆర్థిక రాజధాని. ఇది మా అజెండా. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రజలు ఆ విధంగానే ఎన్నికల్లో తీర్పునిచ్చారు. 94 శాతం సీట్లతో విజయం సాధించాం. సమర్థ పాలనకు, ఉద్యోగాల సృష్టికి, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు” అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
విశాఖ ప్రజలు ఎప్పుడూ టీడీపీతోనే ఉన్నారు
“విశాఖ నగరంపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. 2019లో రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో మేం ఓడిపోయినా విశాఖ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారు. విశాఖ ప్రజలు ధైర్యవంతులు. 2014 సమయంలో హుద్ హుద్ విపత్తు వచ్చినప్పుడు నగరం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు విశాఖ ప్రజలు నగర పునరుద్ధరణకు చంద్రబాబునాయుడికి ఎంతో మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సైతం నష్టాన్ని స్వయంగా చూశారు. విధ్వంసాన్ని అధిగమించిన ప్రజలు.. చిరునవ్వుతో చేతులూపుతూ స్వాగతం పలుకుతుంటే ఆనందంగా ఉంది. అదీ విశాఖ ప్రజల స్ఫూర్తి” అని మంత్రి లోకేశ్ కొనియాడారు.
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వస్తోంది
“గత 17 నెలల్లో ఏపీకి వచ్చిన 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతంకంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు వస్తోంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది. దీనివల్ల శక్తివంతమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం” అని లోకేశ్ ప్రకటించారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తాంది
టీసీఎస్కు 99 పైసలకే భూమి కేటాయించారని కొంతమంది నన్ను విమర్శించారు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ నిర్ణయంవల్ల కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, గూగులవంటి సంస్థలు విశాఖకు వచ్చాయి. ఒక విధాన నిర్ణయం ఎన్నో మార్పులకు కారణమైంది. విశాఖకు ఇది ఎంతో కీలక సమయం. ఇది కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదు.. డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తుంది. ఏపీ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారు. కేంద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖలో 3 లక్షలమంది యోగాంధ్ర నిర్వహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం. ఇది చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు. ఇదీ విశాఖ ప్రజల నిబద్ధత” అని లోకేశ్ ఉద్వేగంగా ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగాం
“ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగాం. కేంద్రం స్టీల్ ప్లాంట్కు రూ.11వేల కోట్ల సాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు అందించింది. మూడు ఫర్నేస్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి. వందశాతం సామర్థ్యంతో నడిపి ప్లాంట్ను లాభదాయకంగా మారేలా చేస్తాం. నిధులు అడగాల్సిన అవసరం రాకూడదు. ఇదే మా లక్ష్యం. రూ.14వేల కోట్ల సాయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించడమే కాదు.. అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. ఇది కేవలం ఏపీ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థకూ దోహదం చేస్తుంది. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ను కాపాడుకున్నాం. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఏ ఒక్క పెట్టుబడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. మొత్తం ఎకో సిస్టమ్ రావాల్సిన అవరసం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది” అని మంత్రి లోకేశ్ ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఐటీ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.