- కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం
- పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో వీరోచితంగా పోరాడిన నంబూరి శేషగిరిరావు
- ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ
- కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి
ఉండవల్లి (చైతన్యరథం): మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అని, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి లోకేష్.. ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను గురువారం ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసంచేస్తుండగా టీడీపీ పోలింగ్ఎజెంట్ గాఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు దాడికిపాల్పడి ఆయనను తీవ్రంగా గాయ పరిచారు. ఇలాఉంటే రెండు నెలల క్రితం ఆయన గుండె పోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు..
మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తామంతా శేషగిరిరావు కుటుంబానికి అండగా ఉంటామని, కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.