- పౌర సేవల్లో ప్రజల సంతృప్త స్థాయే ముఖ్యం
- ప్రభుత్వ శాఖల పనితీరుపై నెలవారీ ఆడిట్ జరగాలి
- వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం మరింత పెరగాలి
- ఆర్టీజీఎస్, పౌర సేవలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- డ్రోన్ సిటీకి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
- డిసెంబరులో డ్రోన్ షో నిర్వహించాలని నిర్ణయం
అమరావతి (చైతన్యరథం): వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగు పరిచేందుకు అధికారులు మేధోమథనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్త స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆర్టీజీఎస్, పౌర సేవలపై ప్రజల సంతృప్త స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, సీఎస్ కే.విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల్లో ప్రజల సంతృప్త స్థాయి పెంచడంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ పాటు క్యూఆర్ కోడ్ ద్వారా వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది, అసంతృప్తి ఎక్కడెక్కడ ఉందన్న సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించారు. తద్వారా సమస్య మూలాలను కనుగొని వాటిని వేగంగా పరిష్కరించటం ద్వారా ప్రజల్లో సంతృప్త స్థాయిని మరింత మెరుగుపరుచుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
ఆర్టీజీఎస్ డేటా లేక్ లో అపారమైన సమాచారం నిక్షిప్తమై ఉందని తద్వారా డేటా ఆధారిత నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం యూనిట్గా ప్రభుత్వం 19 విభాగాల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రతీ రోజూ దృష్టి సారించాలని అలాగే ప్రతీ 15 రోజులకూ ఒకసారి సమాచార సేకరణ చేయాలని సూచించారు. వీటిపై ప్రతీ నెలా ఆడిట్ నిర్వహించి ప్రతీ మూడు నెలలకూ ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. దీనికోసం రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గం స్థాయిలో సమాచారం తీసుకుని విశ్లేషించాలని పేర్కొన్నారు. 15 నెలలుగా ప్రజల్లో సంతృప్త స్థాయి క్రమంగా మెరుగుపడుతోందని ఇది మరింత పెరగాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవల్లో ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నదే ప్రధాన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పాలకుల నిర్వాకం కారణంగా రెవెన్యూ రికార్డులు తారుమారై వివాదాలు పెరిగాయని… వాటిని సరిచేస్తున్నట్టు సీఎం తెలిపారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన
ప్రజలకు అందిస్తున్న సేవల ప్రమాణాలను మెరుగుపరుచుకుని సంతృప్త స్థాయిని పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ శాఖలు, అధికారులు, ఉద్యోగుల పనితీరు విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో నైపుణ్యాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో సాంకేతిక కారణాల వల్ల కొందరికి పథకాలు అందడం లేదని, అలాంటివారి అర్హతలు పరిశీలించి వారు కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు పొందేలా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్సు ద్వారా అందిస్తున్న 730 సేవల వినియోగం మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్సు ద్వారా సులభంగా అందుతాయనే భావన ప్రజల్లో విస్తృతమైతే ఎక్కువగా వినియోగించే ఆస్కారం ఉంటుందన్నారు. దీనికి తగినట్టుగా ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సూచించారు. డ్రోన్ల వినియోగానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రైవేటు వినియోగం కూడా పెరిగేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. డిసెంబరులో డ్రోన్ షో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్న దృష్ట్యా డ్రోన్ సిటీకి శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ సహా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.