- ఐదేళ్ల వైసీపీ అరాచకపాలనలో ఆటోడ్రైవర్లకు అనేక ఇబ్బందులు
- యువగళం హామీ మేరకు ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం
- మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకం
- డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతాలు
- ఆటోడ్రైవర్ సేవలో.. ప్రారంభకార్యక్రమంలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం అన్నారు. ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు అద్భుతంగా పనిచేస్తుండటం వల్లే ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. ఇది మీ అందరి ప్రభుత్వం… మళ్ళీ వస్తాం… మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆటో డ్రైవర్ల కష్టాలు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆటో డ్రైవర్లకు సహాయం అందిస్తూనే ఉన్నారు. వారి కష్టాలు తీర్చేందుకే ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిందని మంత్రి లోకేష్ వివరించారు.
మంచితనంలో మిన్న ఆటో డ్రైవర్లు
ఒక ఆటో వెనుక రాసిన కొటేషన్ నాకు బాగా నచ్చింది. “వర్షం ఎలా పడుతుంది అని మీ పిల్లలు అడిగితే.. దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు… ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం పడుతుంది అని చెప్పండి..” అనే కొటేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఒక ఆటో డ్రైవరన్న ప్రచారం చేస్తున్నాడు. అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి. జరభద్రం భయ్యా.. మనమంతా క్షేమంగా ఇంటికి చేరాలి వంటి ఆటో వెనుక రాసుకున్న కొటేషన్లు లాగానే వారు తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. ఆటో వెనుక ఉండే నవ్వు తెప్పించే ఆహ్లాదకరమైన కొటేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. అప్పు చేసి కొన్నానురా… నన్ను చూసి ఏడవకురా, హార్అని ఆశపెట్టకు.. బై అని బాధ పెట్టకు… వంటివి చాలా సరదాగా ఉంటాయి. పెద్దమనసున్న వ్యక్తులు ఆటోడ్రైవర్లు. ఆటోలో బ్యాగు మరిచిపోయి వెళ్లిపోతే… వెతికి మరీ అప్పగిస్తున్నారు. మొబైల్ వదిలిపోతే… తిరిగి ఇస్తున్నారు. విలువైన వస్తువులను పోలీసులకు అప్పగిస్తున్నారు. ఆటో యూనియన్ల ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు.
మీ రుణం తీర్చుకునేందుకే..
ఎన్ని సమస్యలున్నా… ఎన్ని కష్టాలున్నా… నవ్వుతూ ప్రయాణికులను ఆదరిస్తారు ఆటోడ్రైవర్లు. యువగళం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో సమావేశమై వారి సమస్యలు, కష్టాలు తెలుసుకు న్నాను. కామన్ మ్యాన్ కార్ ఆటో… వానొస్తే తడవకుండా ఇంటిదగ్గర దింపేది మీరే. సామాన్యుడి కారు ఆటో, వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది ఆటో డ్రైవర్లు, పిల్లల్ని భద్రంగా స్కూలుకి తీసుకెళ్లి తెచ్చేది మీరే… అనారోగ్యమైతే అంబులెన్సులా మారి ఆస్పత్రికి తీసుకెళ్లేది ఆటోవాళ్లే. పనికి వెళ్లాలన్నా, ఆఫీసుకు చేరుకోవాలన్నా, బస్సూ, రైలు ప్రయాణాలకు ఫీడర్ వెహికల్ ఆటో మాత్రమే. మీరు
ఆటో తోలడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. మీ రుణం తీర్చుకునేందుకే ఈ పథకం పేరు -ఆటో డ్రైవర్ల సేవలో – అని పెట్టాం. కార్మికులు, డ్రైవర్లు భక్తిశ్రద్ధలతో తమ వాహనాలు పూజలు చేసి, ఆనందంగా దసరా పండుగ చేసుకున్నారు. దసరా అయిన 3 రోజుల్లోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కో డ్రైవరుకు రూ.15000 ఇస్తున్నాం. సుమారు 3లక్షలమంది డ్రైవర్లకు ఈ పథకం కింద రూ.436 కోట్లు అందిస్తున్నాం. గత వైసిపి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. కుడి చేత్తో పది ఇచ్చి ఎడమ చేత్తో వంద లాగేశారు. వైసీపీ ఐదేళ్లలో పాలనలో గుంతల్లో పడి
ఆటోలకు జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు. పోయిన ప్రాణాలు ఎన్నో? ఆటోల రిపేర్లకు వేలకు వేలు ఖర్చు
చేయలేక ఆటోలు అమ్ముకున్నారు. గతంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాదేశారు. వైసిపి హయాంలో గుంతలు పూడ్చే దిక్కు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పవనన్న నేతృత్వంలో రూ.3వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చాం. పాత వాహనాలపై ఉన్న గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేలను రూ.3 వేలకు తగ్గించాం. యువగళంలో ఇచ్చిన
హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆటో స్టాండ్లలో చార్జింగ్ పాయింట్, వాటర్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
మహిళలను గౌరవిస్తేనే..
ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా, ఆటో తోలాలి అన్నా మహిళలే. నేను ఈ వేదికకు వచ్చిన ఆటోను నడిపిన మహిళా ఆటో డ్రైవర్ స్వర్ణలత. ఆమె ఇంట్లో కష్టాలు నేను తెలుసుకున్నా. మగవాళ్లకన్నా ఆ అక్కే అద్భుతంగా ఆటో నడిపింది. స్వర్ణలత ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంట్లో ఆమె భర్త సహకరిస్తున్నారు. కలసికట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆవిడకు అందాయి. తల్లికి వందనం వచ్చింది, దీపం పధకంలో సిలెండర్లు వచ్చాయి, వారి అత్తగారికి ప్రజాప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. మహిళల్ని గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది. అప్పట్లో మంత్రి రోజా మహిళల్ని కించపరిచేలా మాట్లాడారు. ఆమెకు చీర, గాజులు ఇచ్చి నిరసన తెలిపేందుకు తెలుగు మహిళలు ఆటోలో వెళ్లారు. ఆటోలో మహిళలను తీసుకెళ్లిన హమీద్ బాషాకి చెందిన ఆటోని పోలీసులతో మంత్రి రోజా సీజ్ చేయించారు. ఈ విషయాన్ని చంద్రబాబుకి చెబితే ఎలాంటి సాయమైనా చేసి హామీద్ ను ఆదుకోవాలని చెప్పారు. మహిళలను కించపర్చేపదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాంటి పదాల వాడకూడదు. మహిళలను గౌరవించడంపై ప్రతి ఆటోడ్రైవర్ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
మంగళగిరి చేనేత కండువాలతో స్వాగతం
అంతకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో సింగ్ నగర్ బయలుదేరారు. ఆటోలు ఎక్కే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ల కు మంత్రి లోకేష్ మంగళగిరి చేనేత కండువాలు కప్పి స్వాగతం పలికారు. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్లకు మద్దతు గా మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరినీ మంత్రి లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. బాణసంచా పేలుళ్లు, తీన్ మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేసింది.