- మరో కొత్త సంక్షేమ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం
- ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు
- మేనిఫెస్టోలో చెప్పకున్నా అమలు
- 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి
- విజయవాడ సెంట్రల్లో నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- హాజరుకానున్న ఉపముఖ్యమంత్రి. విద్యాశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం… ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో…’ పథకానికి శ్రీకారం చుట్ట నుంది. రాష్ట్రంలో సొంత ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందిం చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించను న్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు.
2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి
సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం గత పాలకులకంటే 50 శాతం అదనంగా రూ.15 వేలు ఇస్తోంది. అలాగే గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం 2,61,516 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రూ.261.51 కోట్లే ఖర్చు పెట్టింది.
గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి సర్కారులో లబ్ధిదారులు సుమారు 30 వేల మంది పెరిగారు.. అలాగే డ్రైవర్లకు రూ.175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతోంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు లబ్ధి కలగనుంది.
హామీ ఇవ్వకున్నా డ్రైవర్లకు లబ్ధి
వాస్తవంగా చూస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అనే కార్యక్రమం పార్టీ మేనిఫెస్టోలో చెప్పలేదు. అయితే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందిం చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభి స్తోంది. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారు నష్టపోకూడ దని సీఎం స్పష్టం చేయడంతో గతానికంటే ఆర్థిక సాయం పెరగడంతో పాటు.. లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనదారులకు మేలు కలిగించేలా పనులు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఉన్న రోడ్ల దుస్థితి కారణంగా ఆటో డ్రైవర్లు, వాహన దారులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు గుంతల రోడ్ల కారణంగా ఆటోలు, ఇతర వాహనాలు దారుణంగా దెబ్బతినేవి. వీటి రిపేర్ల ఖర్చు తడిసిమోపెడు అయ్యేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య నుంచి గట్టెక్కించింది. రూ.1,000 కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టి సాఫీగా ప్రయాణం సాగేలా చేసింది. అంతేకాకుండా పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ను కుదించింది. నాడు రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ను రూ.3వేలకు తగ్గించి వాహనదారులకు పెద్దమొత్తంలో ఉపశమనం కలిగించింది. దీంతో ఆటోలు, క్యాబ్లపై పెద్ద ఎత్తున భారం తొలగింది.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే… వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.