- ఏర్పాటుకు సహకారం అందించండి
- విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్తో భేటీలో మంత్రి నారా లోకేష్ వినతి
- ఇటీవలి సింగపూర్ పర్యటన, రాష్ట్ర అభివృద్ధిపై ఆ ప్రభుత్వంతో చర్చలను వివరించిన లోకేష్
న్యూఢిల్లీ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. న్యూఢల్లీిలో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్తో సోమవారం మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి కేంద్రం సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవం కోసం ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను మరింత విస్తరించాలి. సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించండి. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు.. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వివరించారు. దీనికి పూర్తి సహకారం కావాలని జైశంకర్ను లోకేష్ కోరారు.
విదేశాల్లో 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు
ఏపీకి చెందిన సుమారు 35లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అమెరికాలో 10లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. యుఎస్లో అక్కడ ప్రజల తలసరి ఆదాయం 70,000 డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం 1,26,000 డాలర్లుగా ఉంది. ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్లతో మొబిలిటీ, మైగ్రేషన్ పార్టనర్ షిప్ అరేంజ్మెంట్ (ఎంఎంపీఏ) భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో కేంద్రం చర్యలు అభినందనీయం. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతునిస్తుంది. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్రస్థాయిలో ఆయా ఒప్పందాలను అమలుచేయడంలో ఏపీ ముందంజలో ఉంటుందని మంత్రి లోకేష్ వివరించారు.
త్వరలో నైపుణ్యం పోర్టల్
స్కిల్ డెవలప్మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది. ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ను త్వరలో ప్రారంభించబోతున్నాం. నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్మెంట్ (ఎంఎంపీఏ) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టిసారించాం. ప్రపంచ డయాస్పోరా వేదికగా ఐటి, సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత విద్య రంగంలో పెట్టుబడులు, నాలెడ్జి ట్రాన్సఫర్ కోసం ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు డేటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రి జైశంకర్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.