ఎన్నికలు జరిగిన విధానమే అందుకు ఉదాహరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్య
మంగళగిరి (చైతన్య రథం): పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకంనుంచి బయటపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం సీఎం చంద్రబాబు ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పలువురికి ఆర్థిక సాయం అందచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రస్తావించారు. మీడియా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిస్తూ.. ‘‘వైయస్ హయాం నుంచీ పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనం జగన్లో కనిపిస్తోంది. ఆయన వైఖరి ఎలాంటిదో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పులివెందులలో నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితినుంచి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 11మంది పోటీ చేయగలిగే పరిస్థితి కనిపించింది.
రెండు పోలింగ్ బూత్లలో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా? శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి కనుకే ప్రజలు ధైర్యంగా ఓటేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా పలువురు మరణించడం బాధాకరమన్నారు. నష్ట నివారణకు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు సమన్వయం చేసుకుంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.