నిర్దేశిత గడువుకు ముందే పనుల పూర్తికావాలి
ప్లాట్ల బదిలీలపై రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు
సీఆర్డీఏకు సీపం చంద్రబాబు నిర్దుష్ట ఆదేశం
పనుల పురోగతి, భూకేటాయింపులపై సమీక్ష
నిర్మాణాలకు తెచ్చిన ఇసుకనూ ఎత్తుకెళ్లారు
గత ప్రభుత్వ దుర్మార్గంఫై కాంట్రాక్టర్ల ఫిర్యాదు
అమరావతి (చైతన్య రథం): రికార్డు టైమ్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువుకంటే ఆరు నెలల ముందే పనుల్ని పూర్తిచేసి నగర నిర్మాణాన్ని ఆవిష్కరించాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతి, వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి పి నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతోపాటు రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో ఎల్పీఎస్ లే అవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, డక్ట్లులాంటి ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని.. 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. కాంట్రాక్టు సంస్థలు ఆయా పనుల్ని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. రాజధానిలో చేపడుతున్న నిర్మాణ పనుల ప్రగతి ప్రజలకు కనిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ నెలా అమరావతి పనుల పురోగతిని సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. సమయం ప్రకారం పనులు పూర్తికాకపోతే.. ఎందుకు కాలేదన్న అంశంపై సదరు కాంట్రాక్టు సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. దీంతోపాటు రియల్ టైమ్లో పనుల పురోగతిని పర్యవేక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆటో పైలట్ మోడ్లో పనులు జరగాలని సూచించారు.
రైతులకు ఇబ్బందిలేని రీతిలో ప్లాట్ల బదిలీ
రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ కూడా ప్రభావితం కాకుండా ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామని సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగక పోవటంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము, సామాగ్రి తుప్పుపట్టి పోయిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వల్ని కూడా గత పాలకులు ఎత్తుకెళ్లారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఇసుకను భర్తీ చేయాల్సిందిగా మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
భూములిచ్చిన సంస్థలకు వేగంగా అనుమతులు
రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. బిట్స్ పిలానీ, ఎక్స్ఎల్ఆర్ఐ తదితర సంస్థలకు త్వరితగతిన భూమిని కేటాయించాలని సూచించారు. అలాగే ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన 72 సంస్థలు ఏమేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సంస్థలకు స్థలం ఇవ్వడంతోనే పని పూర్తైనట్టు కాదని.. వీటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాలన్నారు. ఒక్కో ఇటుకా పేరిస్తేనే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని సీఎం అన్నారు. రాజధాని నగరంలో పెట్టుబడులతోపాటు నగరాభివృద్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. పెద్ద ప్రాజెక్టులను సీబీఎన్ మాత్రమే సమర్ధంగా చేయగలుగుతారని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ కూడా చెప్పారని.. ఈ క్రెడిబిలిటికి నష్టం వాటిల్లకుండా చూడాలని స్పష్టం చేశారు. అమరావతిలో స్పోర్ట్ సిటీ, పర్యాటక ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్, బయోటెక్నాలజీ, విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు.
ఎకానమీ, ఎంప్లాయిబిలిటీ, లివబులిటీ లక్ష్యం
కేవలం భవనాల అభివృద్ధితో మాత్రమే రాజధాని నగరం పూర్తికాదని.. ఆర్ధిక కార్యకలాపాలు కూడా పెద్దఎత్తున రావాల్సి ఉందని సీఎం సూచించారు. నిర్మాణాలను పూర్తిచేసి రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వచ్చి ఆర్ధికంగా పరిపుష్టం అవుతుందన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతోపాటు నివాస యోగ్యమైన నగరంగా అమరావతి మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాలెడ్జి ఎకానమీ, స్టార్టప్స్లాంటి ఎకో సిస్టం కూడా రాజధాని నగరంలో కల్పించాలని సూచించారు. దేశంలోని అత్యుత్తమ పది రియల్ ఎస్టేట్ కంపెనీలను కూడా ఆహ్వానించి ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. రాజధాని నగరాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా మార్చేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. సీడ్ కేపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో కూడా నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.