అమరావతి (చైతన్యరథం): సినీ నిర్మాతలు తెలియజేసిన సమస్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలుగు సినీపరిశ్రమలో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు సోమవారం మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు కలిశారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
నిర్మాతల విజ్ఞప్తి..
మంత్రి దుర్గేష్తో సమావేశం అనంతరం నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సూచనలు ఇచ్చాం. సినీ రంగానికి సంబంధించి ఏపీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరాం. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఆదుకునేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. సినీ రంగాన్ని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని కోరాం. థియేటర్ల యజమానులు నష్టపోతున్న దృష్ట్యా ఆదుకోవాలని విన్నవించాం. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని కోరాం. సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోరాం. ఇప్పిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలుస్తాం అని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో బీవీఎస్ఎన్ ప్రసాద్, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వప్రసాద్, నాగవంశీ, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, తదితరులున్నారు.