- నేచర్ కాన్సెప్టుతో ప్రజా రాజధాని నిర్మాణం
- రహదారులు, కూడళ్లు, గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో ఆహ్లాదకరమైన వాతావరణం
- దేశీయ వృక్షజాతులు, ఔషధ మొక్కలకు ప్రాధాన్యమిస్తూ హరిత ప్రణాళిక
- సింగపూర్ బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలో అమరావతిలో గృహనిర్మాణం
- అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి ఇన్ నేచర్ అనే కాన్సెప్టుతో హరిత ప్రణాళికల్ని అమలు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో నిర్మితమవుతున్న ప్రధాన ట్రంక్ రోడ్లు, అనుబంధ రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్ల వద్ద నిర్మించే రహదారులు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు, ముఖ్యమైన కూడళ్లను అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం స్పష్టం చేశారు. రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఔషధ మొక్కలు నాటటంతో పాటు రాజధాని ప్రాంతం అంతా జీవ వైవిధ్య ప్రాంతంగా మారాలని పేర్కొన్నారు. గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని సూచించారు. అలాగే రివర్ ఫ్రంట్ను అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
బ్లూ, గ్రీన్, పుష్ప వికసిత రాజధాని
గ్రీన్, బ్లూ నగరంగా అమరావతిని తీర్చిదిద్దటంతోపాటు ఏడాది పొడవునా వివిధ కాలాల్లో వేర్వేరు జాతుల పుష్పాలు వికసించి ఆహ్లాద పరిచేలా మొక్కలు నాటాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలు, పర్యాటకులు వాటి గురించి మాట్లాడుకునేలా ఈ పుష్పాలు సీజన్ల వారీగా వచ్చేలా ప్రణాళిక చేపట్టాలని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో వివిధ ఫల, పుష్ప జాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఏడీసీ అధికారులకు సూచించారు. అమరావతిని సుందరంగా తీర్చిదిద్దేందుకు బెంగుళూరు నగరంతోపాటు సింగపూర్ సహా వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. అలాగే ఔషధ మొక్కలు, అరుదైన, అంతరించి పోతున్న జాతుల మొక్కలు, వృక్షాలను కూడా సంరక్షిస్తున్న ప్రాంతంగా అమరావతి ఉండాలని సూచించారు. ఔషధ మొక్కలను పెంచేందుకు ప్రముఖ యోగాగురు బాబారామ్ దేవ్నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీలో నర్సరీలు కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన కడియంను కూడా ప్రోత్సహించేలా చూడాలన్నారు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశీయ వృక్ష జాతులను కూడా అమరావతిలో పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ గ్రీన్ ప్రాంతం అంతా కాలుష్యాన్ని నియంత్రించటంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఉండాలని స్పష్టం చేశారు. అమరావతి బ్యూటిఫికేషన్ ప్రణాళికలో స్థానికంగా ఉన్న యూనివర్సిటీలు, విద్యార్ధుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. చారిత్రక నగరంగా అమరావతి సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడటంతోపాటు ఆధునికంగా పార్కులను తీర్చిదిద్దాలని అన్నారు.
సేదదీరేలా కృష్ణా రివర్ ఫ్రంట్
రాజధాని అమరావతి నగరంలోనూ అత్యంత నాణ్యమైన, అందరికీ అందుబాటులో గృహ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సింగపూర్లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలోనే రాజధాని నగరంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చెట్లు, పార్కులు నిర్మించాలని స్పష్టం చేశారు. 250 ఎకరాల ప్రాంతంలో 10 వేలమంది నివసించేలా బిడదారి ఎస్టేట్ను నిర్మించాలన్నారు. అలాగే ప్రకృతిలో సేదదీరేలా వివిధ ప్రాంతాలను తీర్చిదిద్దాలన్నారు. రాజధానిలో నిర్మించే వివిధ పార్కుల్లో వివిధ దేశాల పేర్లను పెట్టటంతోపాటు ఆయా దేశాల్లో పెరిగే పుష్పజాతుల మొక్కలుండేలా చూడాలన్నారు. ప్రధాన రహదారులకు ప్రకృతి పేర్లు కలిసొచ్చేలా పెట్టాలని స్పష్టం చేశారు.
అలాగే అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు సహా కాలువల వ్యవస్థను కూడా అత్యంత సుందరంగా కనిపించేలా ప్రణాళికలు చేయాలని స్పష్టం చేశారు. కృష్ణాతీరం ఇరువైపులా అహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మార్చాలన్నారు. రహదారి మార్గాలకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. శాఖమూరు రిజర్వాయర్ను 50 ఎకరాల ప్రాంతంలో సిద్ధం చేస్తున్నట్టు ఏడీసీ అధికారులు సీఎంకు వివరించారు. ఆ సరస్సు చుట్టూ గ్రీనింగ్తో పాటు సేదతీరేందుకు వీలుగా చెట్లను నాటాలని సీఎం సూచించారు. రహదారుల వెంట వెళ్తున్న వారు కూడా ప్రకృతిని ఆస్వాదించేలా బ్యూటిఫికేషన్ జరగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువనున్న ఆరు దీవుల్ని కూడా సుందరంగా తీర్చిదిద్ది రివర్ ఫ్రంట్లను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వివరించారు. అయితే పర్యావరణానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లి కొండవున్న ప్రాంతం నగరంలో మధ్యన ఉంటుందని ఎక్కడినుంచి చూసినా పూలతో అందమైన వనంలా కనిపించేలా మొక్కలు నాటాలని అన్నారు.