- సర్కారీ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దటమే ఏకైక లక్ష్యం
- ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టిపెడతాం
- విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
- ఉండవల్లి నివాసంలో ‘షైనింగ్ టీచర్’ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్
- విద్యార్థిగా మారి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సలహాలు, సూచనలు స్వీకరణ
ఉండవల్లి (చైతన్యరథం): ప్రభుత్వ విద్య బలోపేతం చేసే బృహత్తర లక్ష్యంలో ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నాం, ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో బుధవారం ఘనంగా సత్కరించారు.
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిచారు
2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కల్యాణి తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారు. తాను బాధ్యతలు చేపట్టేనాటికి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా అందులో ఇద్దరు మాత్రమే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేవారు. ఒకానొక దశలో పాఠశాలను మూసివేయాలని భావించారు. ఉపాధ్యాయురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నిధులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు పాఠశాలలో మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేశారు. తన పనితీరుతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించారు. దీంతో 2020-21 విద్యాసంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 53 కి పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు చేరడం ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారిలో 23 మంది విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం పొందగా, ఒకరికి ప్రతిష్టాత్మక నవోదయ పాఠశాలలో ప్రవేశం లభించింది. ప్రస్తుతం పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి
షైనింగ్ టీచర్తో సమావేశం సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యశాఖ మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయురాలి నుంచి ఎంతో వినమ్రంగా సలహాలు సూచనలు స్వీకరించారు. వాటిని ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. పట్టుదలతో స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. సింగిల్ టీచర్గా ఉండి పెద్దసంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావడం చరిత్ర అని ప్రశంసించారు. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కల్యాణి మాట్లాడుతూ.. తన వద్ద చదువుకునే విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఆశయంతో పనిచేశానన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య లభిస్తుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించాలి. స్టార్ ఆఫ్ ది వీక్ పేరుతో ప్రతి సోమవారం హోం వర్క్, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, యూనిఫాంలో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేస్తాను. వారి ప్రోగ్రెస్ను నిరంతరం పర్యవేక్షిస్తాను. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ పేరుతో విద్యార్థుల పుట్టినరోజు నాడు వ్యక్తిగత పరిశుభ్రత తెలియజేసేలా టీచర్కు సబ్బు ప్రదానం చేసే సంస్కృతి తీసుకువచ్చాం. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ‘మా తొలి అడుగు’ పేరుతో వారికి అవసరమైన పలక, బలపం, పెన్నులు, నోట్ పుస్తకాలు అందజేస్తాం. ఎవరైనా స్కూల్కు సెలవు పెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. నేను సెలవు పెట్టాలన్నా అనుమతి తీసుకుంటాను. పిల్లలు బాగా చదవకపోతే తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతాను. ప్రతి రోజూ హోంవర్క్ ఇస్తాను. చిన్న పిల్లలకు పండ్లు, కూరగాయల ఫొటోల ప్రదర్శన ద్వారా వారిలో చదువు పట్ల ఆసక్తి కలిగిస్తానని వివరించారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనంగా మరో టీచర్ను కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 9,600 పాఠశాలలకు తరగతికో ఉపాధ్యాయుడు ఉన్నారు. భవిష్యత్లో మరింత మెరుగుపరుస్తాం. విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. స్టార్ ఆఫ్ ది వీక్ ఆలోచన బాగుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటికే మెగా పీటీఎం నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నాం. నిజానికి ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. ఇక్కడే క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. పట్టుదల ఉంటుంది. విద్యార్థులకు వర్క్ బుక్స్, రాజ్యాంగంపై చిన్నవయసులోనే అవగాహన కలిగించేలా చర్యలు తీసుకున్నాం. ముందు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు దృష్టిసారిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం సీరియస్గా ఉందని తెలియాలి. డీఎస్సీని అడ్డుకునేందుకు 30 కేసులు వేశారు. అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. సమాజంలోనూ మార్పురావాలని, విద్య ద్వారానే ఉన్నతస్థాయికి వెళ్తామన్నారు. ఇకపై ఉత్తమ ఉపాధ్యాయులను కలిసి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. కాగా విద్యాశాఖ మంత్రి స్వయంగా కలిసి సత్కరించడం పట్ల ఉపాధ్యాయురాలు కల్యాణి కుమారి హర్షం వ్యక్తం చేశారు.