- అధికారులకు మంత్రి లోకేష్ అదేశం
- తాడేపల్లిలో సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమం
- ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన మంత్రి
- పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు
- పరిష్కరించి అండగా ఉంటామని మంత్రి భరోసా
తాడేపల్లి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని మహానాడు కాలనీలో బుధవారం నిర్వహించిన సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి లోకేష్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. స్థానికుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి.. నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు మహానాడు కాలనీ ఒకటవ రోడ్డుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు.
బీసీ సామాజికవర్గం వ్యక్తి ఇంటికి వెళ్లి ఆరా
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీసీ సామాజికవర్గానికి చెందిన వెదుళ్ల మధుబాబు ఇంటికి వెళ్లిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందాయా అని ప్రశ్నించారు. తమ దశాబ్దాల కల అయిన ఇంటి పట్టా అందించారని, రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్కు మధుబాబు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇంటి పట్టా కోసం తాము ఎక్కడికీ తిరగలేదని, బస్సులు పెట్టి మరీ తమను తీసుకెళ్లారని, భోజనంతో పాటు బట్టలు పెట్టి ఇంటి పట్టా అందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్ చదువుతున్న తమ కుమార్తెకు తల్లికి వందనం సాయం అందిందని, దీపం పథకం కింద గ్యాస్ సబ్బిడీ నగదు బ్యాక్ అకౌంట్లో జమ అయిందన్నారు. ప్రభుత్వ పథకాలు, పనితీరు పట్ల తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. కుమారుడు ఇంటర్ పూర్తిచేశాడని, త్వరలోనే ఇంజనీరింగ్లో చేరుస్తామని తెలిపారు. పిల్లలు బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వారికి చెప్పారు.
1. ఇంటి పట్టాల గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేదు
యాపతి లక్ష్మి, మహానాడు కాలనీ, తాడేపల్లి
నా కుమారుడికి తల్లికి వందనం పథకం కింద సాయం అందింది. మేం నివసిస్తున్న ఇంటికి పట్టా ఇచ్చారు. ఇన్నేళ్లలో ఎవరూ, ఎప్పుడూ పట్టించుకోలేదు. గ్యాస్ సబ్సిడీ నగదు కూడా అందింది. మా నాన్నకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. గతంలో కంటే గంజాయి వినియోగం బాగా తగ్గింది. రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
2. రిటైనింగ్ వాల్ నిర్మించాలి
షేక్ మెహబూబా, మహానాడు కాలనీ, తాడేపల్లి
ఇంటి పట్టా అందించి మా 40 ఏళ్ల కలను నెరవేర్చారు. మా పిల్లలకు తల్లికి వందనం కింద సాయం అందింది. వరదలు వచ్చినప్పుడు మునిగిపోకుండా రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది.
3. ఇంటికి పట్టా వచ్చింది, రిజిస్టర్ కూడా చేశారు
బొందిలి భాగ్యలక్ష్మి బాయి, మహానాడు కాలనీ, తాడేపల్లి
నెలనెలా మొదటి తేదీనే ఇంటివద్దకు వచ్చి పెన్షన్ అందిస్తున్నారు. గత నెలలో రేషన్ కూడా ఇంటికే తెచ్చి ఇచ్చారు. ఇకపై నెలనెలా ఇంటికే తెచ్చి రేషన్ సరుకులు అందజేస్తామని డీలర్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఖాతాలో పడ్డాయి. మా ఇంటికి పట్టా ఇచ్చారు. చంద్రబాబు పాలన బాగుంది. నారా లోకేష్ మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాను.