- ప్రతి కుటుంబానికీ సంక్షేమం డబుల్
- నేరాలు చేస్తారు… నాపై నెపం నెడతారు
- ఇప్పుడున్నది 2014 సీఎం కాదు… 1995 సీఎం
- ఏడాదిలో కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు
- కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు
- నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి రూ.50 కోట్లు
- కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక
- అభివృద్ధికి, సంక్షేమానికి సైకిలే బెస్ట్
- కుప్పం ప్రజా వేదికపై సీఎం చంద్రబాబునాయుడు
కుప్పం (చైతన్య రథం): విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసంవైపు అడుగులు వేయిస్తూ.. సంక్షేమం అభివృద్ధి చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తూ.. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా పని చేస్తున్నానన్నారు. రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కుప్పంలో రూ.1271.65 కోట్ల పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం, తుంసీ ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో కుప్పం ప్రజలతోనూ.. వివిధ పథకాల లబ్దిదారులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. కుప్పం అభివృద్ధి ప్రణాళికలను వివరించడంతోపాటు… రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఇదే సందర్భంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ… రాజకీయాలను నేరమయం చేసే కొన్ని పార్టీల కుట్రలను సీఎం చందబాబు ఎండగట్టారు.
కుప్పంలోని చివరి ఎకరానికీ హంద్రీ-నీవా నీళ్లు
కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడిరచారు. ‘‘సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చా. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తాం. రూ.3,890 కోట్ల వెచ్చించి.. హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నాం. కుప్పంలో ఇప్పటికే హంద్రీ-నీవా కాల్వల లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో రూ.42.07 కోట్లతో 30.14 కిలోమీటర్ల మేర హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ పనులు పూర్తయ్యాయి. కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తాం. ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తాం. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కుంటుంది. అప్పుచేసి సంక్షేమం చేస్తామనటం ఏంపరిపాలన..? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ. గత ఏడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం. ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నాం. కుప్పంలో రూ.1292 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల్ని చేస్తున్నాం. ఇప్పటికే రూ.125 కోట్ల విలువైన పనులు కూడా పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో గుంతలులేని రహదారులే లక్ష్యంగా పనిచేసాం. గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశాం. నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. నేడు దీపం-2.0తో ఉచిత సిలెండర్లు ఇస్తున్నాం. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా మారుస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఇంటిలోనూ వంటగ్యాస్ ఉంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
బ్రాండ్ కుప్పం
‘‘గతంలో బ్రాండ్ కుప్పం అనేది లేదు. ఇప్పుడు బ్రాండ్ కుప్పం పేరుతో మార్కెట్టులో ప్రమోట్ చేస్తాం. కుప్పంలో తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం. కుప్పంలో ఎయిర్పోర్టు రాబోతోంది. రూ.850 కోట్లను కుప్పం విమానాశ్రయానికి ఖర్చు చేయబోతున్నాం. విమానాశ్రయానికి భూములివ్వొద్దని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎయిర్ పోర్టుకు భూమిచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తాం. అమరావతి రాజధానికి భూములిచ్చారు.. రాజధాని రైతులకూ ప్యాకేజీ ఇచ్చాం. కుప్పంలో ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ పెట్టుకునేంత వరకు నేను మీ వెంట పడతాను. ఇళ్లపై రూఫ్ టాప్ ఏర్పాటు ద్వారా మనమే సొంతగా విద్యుత్ తయారు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేస్తున్నాం. బీసీలకు రాయితీ కింద సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేస్తాం. సూర్యఘర్ పథకాన్ని పూర్తిగా వినియుగించుకుంటే కరెంటు కోతల పరిస్థితి ఉండదు. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. కుప్పంలో ఏసీల అవసరం ఉండదు కానీ.. అవసరమైతే ఏసీలకు సోలార్ విద్యుత్ పెట్టుకోవచ్చు. ఇళ్లకే కాదు వ్యవసాయానికి సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలి. వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగిస్తాం. కుప్పం రైల్వేస్టేషన్ ఆధునీకరిస్తాం. చెన్నైకి, బెంగళూరుకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. పలమనేరు నుంచి కృష్ణగిరి రహదారికి నాలుగు లేన్ల రహదారి వేస్తున్నాం. కుప్పంనుంచి హోసూర్ వరకూ మరో సమాంతర రహదారి నిర్మిస్తాం. కృష్ణగిరి, బెంగళూరు, కోలార్, చెన్నైలమధ్య కుప్పం కేంద్రంగా మారుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి కుప్పంలో జరగబోతోంది. కుప్పం రూపురేఖలు మార్చేందుకు ఓ అద్భుతమైన ప్రణాళిక తయారు చేశాం’’ అని చంద్రబాబు వివరించారు.
ఆరోగ్యం, ఆదాయం, అభివృద్ధి
‘‘కుప్పం ప్రజల ఆరోగ్యం బాగుండాలి. ఆదాయం పెరగాలి. అభివృద్ధి చెందాలి. ఈ దిశగానే స్వర్ణ కుప్పం-2029 విజన్ సిద్ధం చేశాం. అన్ని రంగాల్లోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి.. దేశానికే కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. కుప్పంలో ఆలయాల అభివృద్ధి కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశాం. నియోజకవర్గంలో అన్ని ఆలయాలను పునరుద్ధరించేందుకు ప్రణాళిక చేస్తున్నాం. గోకులం షెడ్లు కూడా పెద్దఎత్తున కట్టించాం. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ ఆవులను ఇచ్చాం. అదే ఇప్పుడు ప్రతి ఇంటికీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. వచ్చే రోజుల్లో కుప్పంలో 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం బాగుండాలి. 130 ఈ-ఆటోలతో చెత్త సేకరిస్తున్నాం. ఎలక్ట్రిక్ ఆటోలతో తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తున్న తొలి నియోజకవర్గంగా కుప్పం మారింది. పర్యాటక కేంద్రంగానూ కుప్పాన్ని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేస్తున్నాం. హార్టీ కల్చర్ హబ్ రాయలసీమ అయితే.. దానికి దిక్సూచిగా కుప్పం మారుతుంది. వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కుప్పం యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ -టాటాతో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కుప్పంనుంచే దీన్ని అమలు చేస్తున్నాం. కుప్పం నియోజకవర్గం కోసం జన నాయకుడు పోర్టల్ ద్వారా నియోజకవర్గంలో సమస్యలు, అర్జీలకు పరిష్కారం చేస్తున్నాం. 10,393 మంది బంగారు కుటుంబాలు కుప్పంలో ఉన్నాయి. వీరందరికీ మార్గదర్శులను అనుసంధానం చేస్తాం’’ అని కుప్పం అభివృద్ధి ప్రణాళికలను సీఎం వివరించారు.
పేదల కోసం అభివృద్ధి యజ్ఞం
‘‘సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా చేస్తున్నాం. వచ్చిన ఆదాయం పేదవారికి కేటాయించాలి. అదే సమయంలో అభివృద్ధినీ సాధించాలి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆ విధ్వంసాన్ని తలచుకుంటేనే భయం వేస్తోంది. రూ.10 లక్షల కోట్ల అప్పులు, అసలూ, వడ్డీలు కలిపి కట్టాలి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ పడకేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని కూడా వేరే వాటికి ఖర్చుపెట్టేసి వివిధ పథకాలను అస్తవ్యస్థం చేసింది. ప్రజల్ని కష్టపెట్టకూడదన్న లక్ష్యంతోనే సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాం. కొవ్వూరు నియోజకవర్గంలో ఓ చర్మకారుడ్ని పలకరించి, డప్పు కళాకారులకిచ్చే పెన్షన్ ఇచ్చాను.. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఏ రాష్ట్రమూ ఏపీ ఇస్తున్నంత పెన్షన్ను ఇవ్వడం లేదు. కుప్పం పక్కనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.. అక్కడా ఇలా పెన్షన్లు ఇవ్వడం లేదు. దివ్యాంగులకు 12 రెట్లమేర పెంచి పెన్షన్ ఇస్తున్నాం. కిడ్నీలాంటి వ్యాధిగ్రస్తులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. మీ ఇంటికి పెద్దకొడుకు తరహాలో సేవచేస్తున్నా. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవటం కూటమి ప్రభుత్వ బాధ్యత. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పథకం అమలు చేశాం. ఐదుగురు పిల్లలుంటే ఒకేసారి రూ.75 వేలు చెల్లించాం. భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూనే ఉంటాం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చెల్లిస్తాం. గత ప్రభుత్వం రూ.7500 మాత్రమే ఇచ్చింది. గత ప్రభుత్వానికంటే.. డబుల్ సంక్షేమం చేస్తున్నాం. దీపంకింద గ్యాస్ పథకం, పెంచిన పెన్షన్ల కింద పేద, మధ్య తరగతతి వారిని ఆదుకుంటున్నాం. ఏ నాయకుడు ప్రజలకు అండగా నిలుస్తారు, జీవితాల్లో వెలుగులు నింపుతారో వారినే ఆదరించాలి. 3775 పెన్షన్లు కుప్పంలో అదనంగా ఇస్తున్నాం. రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించాం. వాట్సాప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలు అందుతున్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే పౌరసేవలు అందేలా గవర్నెన్సును రూపొందించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమస్య పరిష్కారం లభించేలా కార్యాచరణ చేపడుతున్నాం. ఆగస్టు 15లోగా 15 లక్షల బంగారు కుటుంబాలకు లక్షలమంది మార్గదర్శకులను సిద్ధం చేస్తాం. 2029నాటికి పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తా’’మని చంద్రబాబు చెప్పారు.
సైకిల్ ఈజ్ ది బెస్ట్
‘‘కుప్పంలో 400 మంది డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లను అందిస్తున్నాం. ఎక్కువ శ్రమ లేకుండా సైకిల్ తొక్కవచ్చు.. వ్యాయామం కోసం కూడా సైకిల్ తొక్కాలి. అందుకే సైకిల్ ఈజ్ ది బెస్ట్, సైకిల్ తొక్కితే ఆరోగ్యం, ఆనందం. సైకిలే శాశ్వతం. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. 22ఏ భూముల్ని ఇష్టానుసారంగా అమ్మేశారు. రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా, ఆక్రమణలు లేకుండా కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. గతంలో క్వార్టర్ బాటిల్ తాగి నానా యాగీ చేశారు. అఘాయిత్యాలకు పాల్పడ్డారు. రౌడీయిజం చేస్తే ఆటలు సాగనివ్వను. ప్రస్తుతం ఉన్నది సీబీఎన్-2014 కాదు.. సీబీఎన్-1995. 9సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాపై ఎప్పుడైనా నేరారోపణలు ఉన్నాయా..? ఇప్పుడు కొందరు రాజకీయాలను నేరమయం చేస్తున్నారు. బాబాయిని చంపి.. నాపై నేరం మోపారు. కారు కింద వారి కార్యకర్తల్నే తొక్కించి.. కుక్కపిల్లలా రోడ్డుపక్కన పడేశారు. ఇప్పుడు వారి కార్యకర్త మరణానికి కారణం ప్రభుత్వమేనంటున్నారు. కోడికత్తి, గులకరాయి లాంటి డ్రామాలాడి నాపైనే నెపం పెట్టారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను. నాకు తెలిసింది ప్రజాహిత రాజకీయాలు మాత్రమే. రాక్షసులపై యుద్ధం చేస్తున్నా. అభివృద్ధి, సంక్షేమ కోసం యజ్ఞం చేస్తున్నా. యజ్ఞ ఫలితాలను ప్రజలకు అందిస్తాను. తప్పు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.
కులాలు మతాలు కాదు కావాల్సింది అభివృద్ధే. తద్వారా నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నదే నా ఆకాంక్ష. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అందుకే నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో కార్యకర్తలను, సీఎంగా కలెక్టర్నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యోగివరకూ అందరినీ సమన్వయంతో పనిచేయించి పొలిటికల్ గవర్నెన్సు చేస్తున్నాం. పీ`4 ద్వారా పేదలను ఆదుకునేలా బంగారు కుటుంబాలను- మార్గదర్శుల ద్వారా కార్యక్రమం అమలు చేస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. కుప్పంలో కొత్తగా ఎంపికైన పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్లను సీఎం అందచేశారు. అలాగే దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. దీపం `2.0 పథకం కింద కొత్తగా వేయిమందికి గ్యాస్ కనెక్షన్లు అందచేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం వచ్చిన ముఖ్యమంత్రికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహా చిత్తూరు, కుప్పం స్థానిక నేతలు, జిల్లా కలెకర్ట్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.