- అమరావతిలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు
- స్పోర్ట్స్ అథారిటీకి ఏపీ క్రికెట్ అసోసియేషన్ సహకారం
- వైసీపీ హయాంలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం
- మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాల కల్పన
- క్రీడాకారుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
- శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో రాంప్రసాద్ రెడ్డి, కేశినేని చిన్ని స్పష్టం
విజయవాడ (చైతన్య రథం): ఏపీలో క్రీడల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని, దానిలో భాగంగా అమరావతి వేదికగా 2500 ఎకరాల్లో అత్యద్భుతమైన స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు సీపం చంద్రబాబు కృషి చేస్తున్నారని క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శాప్ఛైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. శాప్ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రి, ఎంపీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలుత శాప్ ఛైర్మన్ రవినాయుడుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. శాప్ డైరెక్టర్లుగా నియమితులైన కొవ్వాసు జగదీశ్వరి, ఇ రజినీ, పేరం రవీంద్రనాథ్, పీబీవీఎస్ఎన్ రాజు, ఎస్ సంతోష్కుమార్, బొమ్మినేని శివ, ఎ రమణారావు, ఎండీ రమేష్ కుమార్లతో క్రీడామంత్రి ప్రమాణం చేయించగా.. సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శాప్ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు.
ఏపీ స్పోర్ట్స్ పాలసీ భేష్: శివనాథ్
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్లో భాగంగా 2014-2019 మధ్య రూపొందించిన ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రీడారంగానికి పునాదులు పడ్డాయన్నారు. క్రీడల్లో రాజకీయాలు వద్దని, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత వైసీపీ నాయకులు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేలా రాజకీయాలను పెంచి పోషించారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని రూపొందించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్లు క్రీడలను అభివృద్ది చేసేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోనూ క్రీడలు ఆడేందుకు వసతులు కల్పించేలా నారా లోకేష్ ప్రణాళిక రూపొందించారన్నారు. త్వరలో శాప్ ఆధ్వర్యంలో విజయవాడలో ఫెస్ట్ నిర్వహించనున్నామన్నారు. అమరావతి వేదికగా త్వరలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రానుందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శాప్తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా క్రీడాభివృద్ధి: మండిపల్లి
రాజకీయాలకు తావులేకుండా కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తుందని క్రీడాశాఖామంత్రి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. 20ఏళ్లుగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని శాప్ డైరెక్టర్లుగా నియమించడం శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో భాగంగా రాజకీయ ప్రమేయం లేకుండా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, సీఎం చంద్రబాబు సారధ్యంలో ఏపీలో క్రీడల అభివృద్ధి వేగవంతమైందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కలిసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామన్నారు. శాప్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వంనుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని, క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
క్రీడాకారుల భవిష్యత్తే ముఖ్యం: రవినాయుడు
క్రీడాకారుల భవిష్యత్తే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని, ఆ దిశగా క్రీడాకారులకు మేలు చేకూర్చేందుకు కృషి చేస్తుందని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ల సమిష్టి కృషితో ఏపీలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. క్రీడలు, క్రీడాకారుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు క్రీడలను మరింత బలోపేతం చేసేందుకు శాప్ పాలకమండలి సాయశక్తులా కృషి చేస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించే వ్యక్తులను శాప్ డైరెక్టర్లుగా నియమించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద్, విజయనగరం రీజనల్ ఆర్టీసీ ఛైర్మన్ దన్నుదొర, బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు రఘురామరాజు, స్టేట్ ట్రైబల్ ఎడ్వయిజరీ కమిటీ సభ్యులు ధారూనాయక్, జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ తదితరులు పాల్గొని శాప్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.