అమరావతి (చైతన్య రథం): భూమికంటే ఎక్కువ భారాన్ని మోసేది మహిళ! విద్యార్థి దశనుండే మహిళల్ని గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించి సమాజంలో మార్పు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను’ అంటూ ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పదేపదే మహిళల్ని అవమానపర్చేలా ప్రవర్తిస్తున్న వైసీపీలపై అసహనం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘వైసీపీ నాయకులు ప్రతినిత్యం మహిళల్ని అవమానపరిచేలా మాట్లాడటం తీవ్ర వేదనకు గురిచేస్తుంది. తల్లిని, చెల్లిని మెడపట్టి ఇంటినుండి బయటకు గెంటేసిన జగన్ మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో, ఎన్నిసార్లు మహిళలను అవమానించొద్దని చెప్పినా వారిలో ఎటువంటి మార్పూ కనిపించడం లేదు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతల అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. మహిళల్ని గౌరవించడంతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెరిగేలా చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు వైసీపీ నాయకులూ చదువుకోవాలని కోరుతున్నాను’ అంటూ పోస్టులో పేర్కొన్నారు.