అమరావతి (చైతన్యరథం): యువత మాదకద్రవ్యాలను తిరస్కరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం యువత తమ శక్తిని ఉపయోగించుకోవాలన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. కఠినంగా చట్టాల అమలు, నిఘా ద్వారా మాదకద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చూపుతోందని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్)ను ప్రారంభించి, మాదక ద్రవ్యాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి భవిష్యత్ను ప్రకాశవంతంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి లోకేష్ హితవు పలికారు.