- పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ
- పాలకులు ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలనతో జగన్ ఓ కేస్ స్టడీ
- భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ
- స్వేచ్ఛ, సమానత్వం, న్యాయమనే రాజ్యాంగ మూలాలు మరువొద్దు
- కూటమి ప్రభుత్వం ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేసింది
- సంవిధాన్ హత్య దివస్’లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
విజయవాడ (చైతన్య రథం): భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చని, ప్రజాస్వామ్యంలో అహంకారం, నియంతృత్వ పోకడలు చెల్లవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను ఎవరూ విస్మరించకూడదన్నారు. భవిష్యత్ తరాలకు మంచి, చెడు చెప్పాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న నేతలపై ఉందన్నారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే- పాలకులు ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమిగా మూడు పార్టీలు కలిసి ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్న ముఖ్యమంత్రి.. తనను అభిమానించే తెలుగు ప్రజానీకం కోసం అహర్నిశలు పాటుపడతానని స్పష్టం చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘సంవిధాన్ హత్యా దివస్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరేళ్ల కిందట ఇదే రోజు ప్రజా వేదిక కూల్చారని.. ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్లు సందర్భంగా ఈ సంవిధాన్ హత్యా దివస్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘‘ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంస పాలనకు తెరతీసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలన గత ఐదేళ్లూ చూశాం. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదు. నియంతలకు చోటులేదని ఓటుహక్కు ద్వారా ప్రజలు చాటిచెప్పారు. కూల్చివేత నేతలను పంపించి.. పునర్మిర్మాణ బాధ్యతలు మాకు ఇచ్చారు. రాష్ట్ర పురోగతి కోసం కసి, పట్టుదలతో పనిచేస్తున్నాం’’ అన్నారు.
దేశంలో అతిపెద్ద చీకటి రోజు
1975 జూన్ 25న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించారు. దేశానికి అది చీకటి రోజు. భారత రాజ్యాంగం, ప్రజల ప్రాథóమిక హక్కులను కాలరాసిన రోజు. 21 నెలలు దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించారు. ఇది తప్పని చెబితే చాలు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సామాన్యులను హింసించారు. నియంత్రృత ధోరణితో ముందుకెళ్లారు. న్యాయ వ్యవస్థలను కబళించారు. ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. 1975 జూన్ 12న ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చని, ప్రజల వద్దకు వెళ్లి మరోసారి ప్రధాని కావచ్చని చెప్పినా నాటి పాలకులు వినలేదు. అహంభావం, నాకు తిరుగు లేదనే భావం రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. పత్రికలను మూసేశారు. జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండేజ్ వంటి వారితోపాటు మన రాష్ట్రానికి చెందిన ఎందరినో జైళ్లలో పెట్టారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ చేశారు. 1984, ఆగస్టులో ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లగా… మెజారిటీ ఎమ్మెల్యేలున్నా ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఎన్టీఆర్ సహా ప్రజాస్వామ్యవాదులంతా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడారు. 30వ రోజునే ఇందిరాగాంధీ మెడలువంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ప్రజాస్వామ్య విజయం అని చంద్రబాబు గుర్తు చేశారు.
మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం
స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయింది. 8 దశాబ్ధాల ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో సవాళ్లు ఎన్నో విజయాలను మన దేశం చూసింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారత దేశం. మంచీ చెడులు రెంటినీ కూడా మనం గుర్తుంచుకోవాలి. భావితరాలకు మంచిని అందించాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న మాపై ఉంది. డాక్టర్ సమరం చెప్పినట్టు … ఎమర్జెన్సీ సమయంలో నిత్యం ప్రజలగురించి పనిచేసి గోరా చనిపోయారు. ప్రజలకు మంచి, చెడు ఏంటో తెలియజేయాలని ప్రధాని మోదీ, దేశమంతటా ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమానికి నాంది పలికారని చంద్రబాబు అన్నారు.
గత ఐదేళ్లూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన
గడిచిన ఐదేళ్లూ పాలన ఎలా ఉందో అందరం చూశాం. నేనూ బాధితుణ్ణే. నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. కానీ ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. అన్యాయం, అక్రమాలు, అవినీతితో చెలరేగిపోయారు. ఎవరు గొంతు విప్పినా నులిమేశారు. మోసాలు, దాడులు, కేసులు, రౌడీయిజం, ఆస్తులు రాయించుకోవడం ఒకటేంటి.. ఎన్నో అరాచకాలు చేశారు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి పిచ్చివాడిగా ముద్రవేసి చంపేశారు. మన అమ్మాయిని వేరే వారికి ఇవ్వాలన్నా, మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఐదారు తరాలు చూస్తారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే సమయంలో మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోవటం లేదు. మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు. మీరు యుద్ధం చేయాల్సిన పనిలేదు. మీకు ఓటు హక్కు ఇస్తున్నాను అని అంబేద్కర్ అన్నారు. 100 బిలియన్ డాలర్లు ఉండే వ్యక్తి అయినా, కూలి చేసే వ్యక్తికి అయినా ఒకటే ఓటు. ఓటు ఆయుధం. మంచి నాయకుడిని ఎన్నుకుంటే బాగుపడతాం అని చంద్రబాబు ఉద్భోదించారు.
సుపరిపాలనలో తొలి అడుగు వేశాం
బీజేపీ, జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాం. విధ్వంసంనుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు నడిపిస్తామని చెప్పి ఒక్క ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. మిత్రుడు పవన్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ముందుకొచ్చారు. నన్ను అభిమానించిన తెలుగు ప్రజల కోసం ప్రతి నిత్యం పనిచేస్తున్నాను. ఈతరం వారికి ఎమర్జెన్సీ గురించి పెద్దగా తెలీదు. మీరు కూడా చరిత్రను చదువుకోవాలి. మోదీ మనకు ప్రధానిగా ఉండటం మన అదృష్టం. ఆయన నాయకత్వంలో వికసిత్ భారత్ను, మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర సాధిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.