- కూటమి లక్ష్య సాధనకు పెట్టుబడులతో కలసిరండి
- వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే భారీ ప్రోత్సాహకాలు
- రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములై.. మీరూ ఎదగండి
- ధనిక పేదల మధ్య అసమానతలు తొలగించడమే నా లక్ష్యం
- ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- ప్రభుత్వ ఆలోచనలను సమగ్రంగా వివరించిన సీఎం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రొత్సాహకాలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ఫిక్కి ప్రతినిధులకు.. సమావేశానికి హాజరైన వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యాలకు సీఎం వివరించారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏయే రంగాలపై ఉన్నాయనే విషయాన్నీ పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళ్లారు. పాలసీ మేకర్గా పేదరికంలేని సమాజాన్ని భావితరాలకు అందివ్వడమే తన బాధ్యతని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేదలకు- ధనవంతులకు మధ్య అంతరాలను తగ్గించాలంటూ చంద్రబాబు భావోద్వేగంగా ప్రసంగించారు. గత ఐదేళ్ల పాలనను పెట్టుబడిదారులు మరిచిపోవాలని.. ఆ భూతం మళ్లీ రాదని.. పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని భరోసానిచ్చారు. పెట్టుబడులు మొదలుకుని రాజకీయాల వరకు.. చరిత్ర మొదలుకుని భవిష్యత్తు అంచనాల వరకూ ఇలా వివిధ అంశాలపై చంద్రబాబు తన అంతరంగాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు.
పెట్టుబడులు రావాలి… పేదరికం పోవాలి…
రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయని ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పని చేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా పాలసీలు తెస్తున్నాం. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పే కంపెనీలకు ఎక్కువ ప్రోత్సాహకాలిస్తాం. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పెట్టుబుడులు పెట్టండి. రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, హైటెక్ ఇండస్ట్రీస్, ఏరో స్పేస్ రంగాలకు అనువుగా ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు గూగుల్వంటి సంస్థలు రానున్నాయి. అలాగే విశాఖ కేంద్రంగా సీ కేబుల్ వేయనున్నారు. సింగపూర్- విశాఖకు సీ-కేబుల్ వేస్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో కెమికల్, ఫార్మా, టూరిజం, స్టీల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అవకాశం ఉంటుంది. అమరావతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏఐ, క్యాంటం వ్యాలీ.. ఇన్నోవేషన్స్ వంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అనువైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయండి. మీరు అభివృద్ధి చెందండి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రభుత్వానికి సంపద సృష్టి మీ ద్వారా జరగుతుంది. ఆ సంపదను పేదలకు సంక్షేమ రూపంలో అందిస్తాం. ప్రభుత్వాధినేతగా పేదరికంలేని సమాజాన్ని భావితరాలకు అందించడం నా ముందున్న ఏకైక లక్ష్యం’’ అని చంద్రబాబు అన్నారు.
అప్పుడు ఐటీతో అభివృద్ధి- ఇప్పుడు డేటాతో సంపద
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఐటీని ప్రమోట్ చేశానని.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఏఐవంటి రంగాలపై ఫోకస్ పెట్టానని సీఎం చంద్రబాబు వివరించారు. మారినకాలంలో డేటాతో సంపద సృష్టి అనేది కీలకమైందంటూ.. ఈ రంగాలపై ప్రభుత్వం ఎలాంటి విధానాలు అవలంభిస్తుందో చంద్రబాబు వివరించారు. ‘‘టెక్నాలజీ రివల్యూషన్ను అందిపుచ్చుకున్నాం. టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధించవచ్చని నాడే భావించాం. మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలను తెచ్చాం. గతంలో ఐటీ కేంద్రంగా అభివృద్ధి ఆలోచనలు చేసేవాళ్లం. ఇప్పుడు క్వాంటం వ్యాలీ మీద ఫోకస్ పెడుతున్నాం. సమాచారమనేది అతి పెద్ద ఆస్తిగా మారుతున్న ఈ కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే రోజుల్లో అత్యంత కీలకంగా మారనుంది. టెక్నాలజీ ద్వారా సామాన్యునికి కూడా సేవలు అందించడంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. టెక్నాలజీతో నేరాలను కట్టడి చేయవచ్చు. డ్రోన్లతో పోలీస్ పెట్రోలింగ్ చేయవచ్చు. ఎక్కువమందితో చేసే పనిని ఒక్క డ్రోనుతో చేయవచ్చు. మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. టెక్నాలజీ ద్వారా మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకుంటూ ఉంటే.. ఆస్పత్రి ఖర్చులు తగ్గుతాయి. ఇవాల్టి రోజుల్లో ఆస్పత్రుల్లో చేరితే బోలెడంత ఖర్చవుతుంది. కొన్ని ఆస్పత్రులను ఫైవ్స్టార్ హోటళ్ల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఆరోగ్యం బాగుంటే.. అసలు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితే రాదు. దీని కోసం టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యం విషయంలో బిల్ గేట్స్ ఫౌండేషనుతో కలిసి పని చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం. ఈ విషయంలో ఏపీని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నవంబర్నాటికి పూర్తిస్థాయిలో ఆధార్ అథంటికేషన్ చేపడుతున్నాం. రాష్ట్రంలో అన్ని కుటుంబాల యూనిట్గా తీసుకుని జీయో ట్యాగింగ్ చేస్తున్నాం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలందించడానికి ఈ జీయో ట్యాగింగ్ ఉపయోగపడుతుంది. డేటా లింక్ చేస్తున్నాం. దాదాపు 50 అంశాలకు సంబంధించిన విషయాల్లో డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆమేరకు రియల్ టైంలో సేవలు.. నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. టెక్నాలజీని వినియోగించుకుని ఏడాది కాలంలో ఆన్లైన్ సేవలు అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్సును అందుబాటులోకి తెచ్చాం. 503 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15నాటికి 703 సేవలను పూర్తిగా అందించేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
సమాజం నుంచి తీసుకున్నారు… తిరిగి సాయం చేయండి…
ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు.. ధనవంతులు ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘‘మిలియన్, ట్రిలియన్ డాలర్ల ఆస్తిపరులు ఓవైపు… పూట గడవని పేదవాడు మరోవైపు అన్నట్టుగా ఉన్న అసమానతలు తొలిగేలా పని చేస్తున్నాం. సంపన్నులు సమాజానికి సేవ చేసే సమయమిది. సమాజంనుంచి ఎంతో తీసుకుని.. అభివృద్ధి చెందారు. ఇప్పుడు పేదలకు సేవ చేయాల్సిన సమయం వచ్చింది. సమాజంలో ఆర్థిక అసమానతలు పోయేలా చేయడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. ఒకే సమాజంలో మిలియన్ డాలర్ల ఆస్తిపరులు.. పూటకు అన్నం దొరకని నిర్భాగ్యులున్నారు. ఈ అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం వారధిలా వ్యవహరిస్తోంది. అసమానతలను రూపుమాపేందుకు ప్రభుత్వం పీ-4 విధానాన్ని ప్రమోట్ చేస్తోంది. దీనికి పారిశ్రామిక వేత్తలంతా సహకరించాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు.
డిజిటల్ కరెన్సీ రావాలి..
పారిశ్రామికవేత్తల సదస్సులో ఎన్నికల్లో డబ్బు ప్రభావం మీద చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘డిజిటల్ కరెన్సీపై నేనే నివేదిక ఇచ్చాను. 500 నోట్లు రద్దు చేయాలని కోరుతున్నా. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో డబ్బులు పంపిణీ ఎక్కువగా ఉంది. రాజకీయాలు కలుషితం అవుతున్నాయి.. దీంతో అన్ని వ్యవస్థలూ కలుషితం అవుతున్నాయి. కేవలం 100, 200 నోట్లే ఉండాలి. అప్పుడు ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులకు గత ప్రభుత్వ పాలన చేదు అనుభవం. ఆ ఐదేళ్ల గురించి ఆలోచన వద్దు. ఏపీకి నేను తీసుకొచ్చిన బ్రాండును గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. వాళ్లు వస్తే.. మా పరిస్థితి ఏంటని కొంతమంది అడుగుతున్నారు. నాదీ హామీ… నేను ఈసారి ఏమరుపాటుగా లేను. ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కేంద్రంలో ఎన్డీఏ కంటిన్యూ అయింది కాబట్టే దేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతోంది. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం మళ్లీ వస్తుందనే విషయం గురించి భయపడకుండా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’’ అని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చారు.
ఇదిగో చరిత్ర… అదుగో భవిష్యత్తు… విజన్తో విజయం
పారిశ్రామిక వేత్తల సదస్సులో చంద్రబాబు చరిత్రను గుర్తు చేసుకోవడంతో పాటు.. భవిష్యత్తు అంచనాలను వివరించారు. ‘‘రాజకీయ నేతలు… పారిశ్రామికవేత్తలను కలవకూడదనే అపోహ ఒకప్పుడుండేది. గతంలో పారిశ్రామిక సదస్సుల్లో కూడా ప్రభుత్వంవైపు నుంచి ఎవ్వరూ పాల్గొనే వారు కాదు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిని నేనే. నేను 9సార్లు దావోస్ సదస్సులకు హాజరయ్యాను. ఆర్థిక సంస్కరణలకు ముందు గ్రోత్ రేట్ కేవలం 2 శాతమే ఉండేది. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు తెలుగువాడేనని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. గతంలో ఎవ్వరూ విజన్ డాక్యుమెంట్లు రూపొందించేవారు కాదు. నేను 2020 విజన్ డాక్యుమెంట్ రూపొందించాను. విజన్ 2020 నిజమైంది. ఇప్పుడు రూపొందించిన 2047 విజన్ కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను నిర్మించిన సైబరాబాద్ సిటీని బిల్ క్లింటన్ ప్రారంభించారు. ఇప్పుడు అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నాం. ఇది భవిష్యత్ నగరం. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో దేశం ఆర్థికంగా పరుగులు పెడుతోంది. 11 ఏళ్లుగా దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. భవిష్యత్తు ఇండియాదే. గ్రోత్ రేట్ పెరుగుతోంది. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పని చేస్తున్నాం. 2.47 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలని ప్రణాళికలు సిద్దం చేశాం. గ్రీన్ హైడ్రోజన్.. గ్రీన్ అమోనియాను ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రూ.1.45 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. బీపీసీఎల్ రూ.1 లక్ష కోట్లు, ఎల్జీ సంస్థ శ్రీసిటీలో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఐదేళ్ల కాలంలో రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబుడులు తెచ్చి.. 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ ఆలోచనలను సీఎం చంద్రబాబు సమగ్రంగా వివరించారు.
పారిశ్రామికవేత్తలతో మాటామంతీ
ఫిక్కీ సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు కాసేపు ముఖాముఖి నెరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘వాజ్పేయి హయాంలోనే భారతదేశం ఒలంపిక్ క్రీడలను నిర్వహించాలనే ఆలోచన చేసింది. కానీ ఇప్పటి వరకు సాకారం కాలేదు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడలవల్ల చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పెడుతోంది. చిన్నచిన్న దేశాలే ఒలంపిక్ క్రీడలను నిర్వహిస్తున్నాయి. ఏపీలో క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. యోగాంధ్రను అద్భుతంగా చేశాం. నేను చేపట్టిన సంస్కరణల వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భూములను ఎవ్వరూ అమ్ముకోవద్దు. భవిష్యత్తులో భారీగా ధరలు పెరగబోతున్నాయని నాడు చెప్పాను. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలామంది భూముల ద్వారా ధనవంతులయ్యారు. సూట్ కేసుల్లో కాకుండా.. గోనె సంచుల్లో డబ్బులు పెట్టుకునేవారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రతి కుటుంబంనుంచి ఓ పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది’ అని చంద్రబాబు వివరించారు.