- వైసీపీ దుర్మార్గ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడిన సీఎం చంద్రబాబు
- సంవిధాన్ హత్యా దివాస్’’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ (చైతన్యరథం): ప్రజాస్వామ్యానికి చీకటియుగంగా నిలిచిన ‘ఎమర్జెన్సీ’కి 50 ఏళ్లు నిండాయని, ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘సంవిధాన్ హత్యా దివాస్ 2025’’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు కావడంతో నాటి దుర్భర పరిస్థితులను వివరించారు. ఎమర్జెన్సీ కాలం భారత రాజ్యాంగ అమలుకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించిందన్నారు. నాడు ఎమర్జెన్సీని ఎదుర్కొని, నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో బలమైన ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జనతాపార్టీ చేసిన కృషిని, పోరాటాన్ని, ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన 1977 ఎన్నికల్లో జనతాపార్టీ విజయాన్ని మంత్రి దుర్గేష్ కళ్లకు వివరించారు. ఈ సందర్భంగా నాటి జనతాపార్టీ విజయానికి, 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పోరాడి విజయం సాధించిన నేటి కూటమి ప్రభుత్వానికి ఉన్న సారూపత్యను స్పష్టంగా తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్న ఆలోచనతో, ప్రజాస్వామ్యంపై అచంచలమైన విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ జనతా పార్టీగా సమీకృతమై వీరోచిత ఉద్యమాలు చేసి విజయం సాధించి 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చారన్నారు. అలాంటి అరాచక పరిస్థితులే ఏపీలో 2019-24 మధ్య కాలంలో చూశామన్నారు. ప్రతిపక్షనాయకుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడిని 53 రోజులు జైల్లో పెట్టి గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఆ సందర్భంలోనే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడే చారిత్రాత్మక నిర్ణయానికి బీజం పడిరదన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి అరాచక పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యపాలనకు బాటలు వేశాయన్నారు.
ప్రజాస్వామ్యానికి నిలువెత్తు రూపం సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య విలువలపట్ల అచంచల విశ్వాసం గల నాయకుడుగా మంత్రి దుర్గేష్ కొనియాడారు. ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తూ, ప్రజాస్వామ్య విధానానికి నిలువెత్తు నిదర్శనంగా సీఎం చంద్రబాబు నిలుస్తున్నారన్నారు. తాను సీఎం చంద్రబాబును గడిచిన సంవత్సరకాలంగా 26 కేబినెట్ సమావేశాలు, అనేక ఎస్ఐపీబీ సమావేశాల్లో దగ్గరగా చూశానని, ఆయన నాయకత్వ పటిమ ఏంటో అర్థమైందన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజాస్వామ్యపాలను ఎలా చేయాలో తరుచూ దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబునాయుడికి అమోఘమైన నిబద్ధత ఉందన్నారు. ఆయన రాజకీయ పరిణితి చాలా గొప్పదన్నారు. ఎవరైనా ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి హద్దు మీరి మాట్లాడని నేత చంద్రబాబునాయుడు అని మంత్రి దుర్గేష్ అన్నారు. నేటి యువత గతంలో జరిగిన తప్పులు తెలుసుకొని సమాజ మార్పు కోసం సుశిక్షితులైన సైనికులుగా పనిచేయాలని, ప్రజాస్వామ్య విలువలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఇచ్చారు.