- ప్రజా సమస్యల్ని వెలుగులోకి తెచ్చేది మీడియానే
- మీడియా సమాజ హితం కోసం పని చేయాలి
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ఒంగోలు (చైతన్యరథం): జర్నలిస్టులకు మేలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా మాట్లాడుతూ…సమాజాన్ని చైతన్య పరుస్తూ, నిజాన్ని నిర్భయంగా తెలిపే జర్నలిస్టులకు మేలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల కోసం మంత్రుల కమిటీని నియమించామని తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే అంశం పునః పరిశీలనలో ఉందన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. మీడియా సంస్థల మధ్య పోటీతో, వ్యక్తుల మెప్పు కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సమాజానికి హానికరమని, అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేది మీడియానేనన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా జర్నలిస్టులు వారి రాతలతో ప్రపంచానికి తెలియజేసే వ్యక్తులని కొనియాడారు. మీడియా సమాజ హితం కోసం పనిచేయాలని, సమాజంలో ఉన్న అసమానతలు రూపుమాపడానికి, మూఢనమ్మకాలు, దురాచారాలను దూరం చేసే వార్తలు రాయాలన్నారు. నిజాన్ని నిర్భయంగా వార్తలుగా రాసే జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి స్వామి భరోసానిచ్చారు.