- బనకచర్లపై రెండు రాష్ట్రాలకు విశదీకరించండి
- తెలంగాణకున్న అనుమానాలను నివృత్తి చేయాలి..
- అవసరమైతే కేంద్రంద్వారా సమావేశం ఏర్పాటు
- ప్రాజెక్టుపై దశలవారీగానే ముందుకెళ్దాం..
- మంత్రి మండలి భేటీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- వివిధ అంశాలపై మంత్రులకు కీలక సూచనలు
అమరావతి (చైతన్య రథం): పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకున్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్టు పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదు. ఇంకా అనుమతి లేని ప్రాజెక్ట్లను చాలా వాళ్లు కడుతున్నారు. తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లను మాత్రమే కదా ఏపీ వాడుకునేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వరద జలాలను మనం వాడుకుంటామని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని ఆదేశించారు. పోలవరం -బనకచర్ల ప్రాజెక్ట్పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని సూచించారు.
తర్వాత కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ ప్రాజెక్ట్లు ఎప్పుడూ శంకుస్థాపన చేస్తామనేది త్వరగా నిర్ణయించాలని మంత్రి లోకేష్ అన్నారు. పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్కి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విషయం అర్ధమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని చర్చించారు. సున్నితమైన పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్పై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మన నేతలంతా మాట్లాడాలి. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉంది’’ అన్నారు. అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తొలివిడత నిబంధనలే మలివిడతకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని సీఎం తేల్చి చెప్పారు. సాంకేతిక సమస్యల సాకుతో దాటవేత ధోరణి సరికాదని, ఇబ్బందులుంటే తనతో మాట్లాడవచ్చన్నారు. రెవెన్యూ సమస్యలపై తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు. కూటమి ఏడాది విజయాలు ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామన్న సీఎం.. జులై 1నుంచి ఎమ్మెల్యేలు ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, విరాళాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
మంత్రులకు కీలక సూచనలు..
ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తేమశాతం ఎక్కువ ఉందనే కారణంతో పొగాకుకు మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉన్నా మనం చొరవ తీసుకుని రైతులను ఆదుకుంటున్నామన్నారు. చేసిన మంచిని చెప్పుకోవటంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. రైతులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూనే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. డిమాండ్కు తగ్గట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకును ఇంత పెద్దమొత్తంలో కొనుగోలు చేయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వాణిజ్య పంటలని కొనుగోలు చేసింది కూడా ఏపీనేనని గుర్తుచేశారు. ప్రజలకు ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పుకోలేక పోతున్నామని మంత్రులను నిలదీశారు. అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వపరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 6497 మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. టెంపుల్ టూరిజంతోపాటు ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్పై నేతలను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఈతరహా కార్యక్రమాలు పెద్డఎత్తున నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఏడాది పాలనపై సమావేశాలు..
సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి… 2019కు ముందు ఆరేళ్ల అనుభవదారు ఎవరు ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లాస్థాయిలో ఏడాది పాలనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సమావేశం పెట్టాలని కోరారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు ఏడాది పాలనపై సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ నెలాఖరులోపు ఈ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జులై 1వ తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి వివరించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్లు రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధిత భూమి వాళ్లకు లీజ్కు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. బిల్డింగ్ రూల్స్ను మరింత సరళతరం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గుజరాత్లో మాదిరిగా బిల్డింగ్ రూల్స్ను సరళతరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి వెంటనే ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.