- విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటు
- 5ఏళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే
- ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ
- ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించండి
- సుపరిపాలన ` తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): జూన్ 4.. రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుపరిపాలన ` తొలిఅడుగు సందర్భంగా రాష్ట్ర సచివాలయం సమీపంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… అందరూ కూటమి గెలిచింది, టీడీపీ గెలిచింది, జనసేన గెలిచింది, బీజేపీ గెలిచింది అంటున్నారు.. గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు అని స్పష్టం చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ ..164 అవుట్ ఆఫ్ 175. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు. ఇది ప్రజా విజయమని అన్నారు.
కంపెనీలను తరిమేశారు
రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారు అయితే చెడ్డ ఫలితాలే వస్తాయని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు విధ్వంస పాలన మనం చూసాం. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసారు. ఆంధ్రప్రదేశ్ను అప్పులప్రదేశ్ గా మార్చేసారు. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు.. ఉన్న కంపెనీలు తరిమేశారు. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టుబడులు పెట్టం అని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారు. ఆ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి అదో ఉదాహరణ అని మంత్రి లోకేష్ వివరించారు.
రోడ్లపై గోతులు కూడా పూడ్చలేదు
అయిదేళ్లలో ఒక్క రోడ్డు వెయ్యలేదు.. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు.. రాయలసీమకు వరంలా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ను కూడా రద్దు చేసారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం ఇచ్చారు. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు ఇచ్చాం అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కు రెండుసార్లు శంకుస్థాపన చేసారే తప్ప ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. విశాఖపట్నంలో రూ.700 కోట్లతో రాయల్ ప్యాలస్ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్, విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు.
అరాచకపాలనపై తిరుగుబాటు
ఐదేళ్లు అరాచక పాలన సాగింది. దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను వేటాడి, వెంటాడి చంపేసారు. అక్కను వేధించిన వారిని ప్రశ్నించినందుకు బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్పై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. విధ్వంస పాలనపై ప్రజలు తిరగబడి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారని మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది
సుపరిపాలనలో మనం తొలి అడుగు వేసాం. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారు.. ప్రజా ప్రభుత్వం ఏడాదిలో ఏం సాధించింది అని అడుగుతున్నారు. నేను వారికి సూటిగా సమాధానం చెప్పాలి అనుకుంటున్నా. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల మొఖంలో చిరునవ్వు వచ్చింది. ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు వచ్చింది. నియంత పాలన నుండి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
5ఏళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే
వాళ్లు ఐదేళ్లలో సాధించలేనిది మనం ఏడాదిలో సాధించాం. అన్ని సమస్యలు పరిష్కరించేసాం అని నేను చెప్పడం లేదు. ఇంకా చెయ్యాల్సింది ఎంతో ఉంది. గత ప్రభుత్వానికి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టింది. మన చంద్రన్న కేవలం ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ.4 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తిగా మంచానికే పరిమితం అయితే రూ.15 వేలు ఇస్తున్నాం. 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసాం. రూ.8,745 కోట్లు తల్లుల ఖాతాల్లో వేసాం. మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు త్వరలోనే పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడిరచారు.
ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్
గత ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 203 అన్న క్యాంటీిన్లు తిరిగి ప్రారంభించింది. దీపం పథకం ద్వారా కోటి సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేశాం. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదు. ప్రజా ప్రభుత్వంలో 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తాం. గత పాలకులు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దానిని మన ప్రజా ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేస్తే మన ప్రజా ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తేసిందని మంత్రి లోకేష్ తెలిపారు.
పేదరికంలేని సమాజం బాబు లక్ష్యం
పేదరికం లేని సమాజం చూడాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకోసమే పీ4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడమే పీ4 ముఖ్యోద్దేశం. బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తున్న మార్గదర్శులకు నా ధన్యవాదాలు. పవనన్న ఆధ్వర్యంలో పంచాయతీలకు స్వాతంత్య్రం వచ్చింది. పంచాయితీలకు వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసాం. రైతుల నుండి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం, రూ.13,600 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన రూ.1700 కోట్ల బకాయిలు కూడా మనమే తీర్చాము. పొగాకు, మిర్చి, కోకో రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రజా ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి లోకేష్ తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండా
అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వం ఎజెండా. కేవలం ఏడాదిలోనే రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తున్నాం. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టీ కల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి కంపెనీలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్లు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, టీసీఎస్ లాంటి కంపెనీలు వస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
డబుల్ ఇంజన్ సర్కార్ పవర్
డబుల్ ఇంజిన్ సర్కార్ మన పవర్. రాష్ట్రం అడిగిన ప్రతి కోరిక ప్రధాని నరేంద్ర మోదీ తీరుస్తున్నారు. గత ప్రభుత్వం నాశనం చేయాలనుకున్న అమరావతిని డబుల్ స్పీడ్తో పట్టాలెక్కించాం, రూ.60వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. రాజధానికి రూ.15వేల కోట్లు, పోలవరానికి రూ.12వేల కోట్లు ప్రధాని ఇచ్చారు. ఏడాదిలోనే పోలవరం పనులు 8శాతం పూర్తి చేశాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి రూ.11,500 కోట్లు సాయం అందించారు. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ల అభివృద్ధికి రూ.5వేల కోట్లు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సహకరించారు. కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరిస్తున్నారు. ఐదేళ్లలో గత ప్రభుత్వం సాధించలేనివి ప్రజా ప్రభుత్వం ఏడాదిలో సాధించింది. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని మంత్రి లోకేష్ వివరించారు.
విద్యాశాఖలో సంస్కరణలు
విద్యాశాఖ మంత్రిగా నా శాఖలో సంస్కరణలు తెస్తున్నా. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యం. గత పాలకుల ఫోటోలు, రంగుల పిచ్చి మీరంతా చూసారు. యూనిఫామ్ దగ్గర నుండి చిక్కీ వరకూ పార్టీ రంగులు, ఫోటోలే. ఫీజు రీయింబర్స్మెంట్ నుండి చిక్కీల వరకూ రూ.6500 కోట్ల బకాయిలు నా నెత్తి మీద పెట్టి పోయారు. బకాయిలన్నీ క్రమపద్ధతిలో చెల్లిస్తున్నాం. మధ్యాహ్న భోజన పధకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం. స్టూడెంట్ కిట్కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టాం. గత ప్రభుత్వ పాలనలో 1200 స్కూళ్లు వన్ క్లాస్ … వన్ టీచర్ ఉంటే ఇప్పుడు వన్ క్లాస్… వన్ టీచర్ స్కూళ్ల సంఖ్యను 9800కి పెంచామని మంత్రి లోకేష్ తెలిపారు.
కరిక్యులమ్లో మార్పులు
కేజీ నుండి పీజీ వరకూ కరిక్యులం మారుస్తున్నాం. పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించడానికి సెమిస్టర్ వారీగా విభజించి పుస్తకాలు సిద్ధం చేసాం. పుస్తకాల దగ్గర నుండి చిక్కీ వరకూ ఎక్కడ పార్టీల రంగులు లేవు, నాయకుల, ముఖ్యమంత్రి ఫొటోలు, నా ఫోటోలు లేవు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు ఆధ్యాత్మిక ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావుని సలహాదారునిగా నియమించాం. ఆయన నైతిక విలువలపై చక్కటి వీడియోలు, పుస్తకాలు సిద్ధం చేసారు. మహిళల్ని గౌరవించాలి అనే భావనను విద్యార్థి దశ నుండే నేర్పిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
ఉద్యోగులకు హ్యాట్సాఫ్
ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయ. సీఎస్ దగ్గర నుండి క్షేత్ర స్థాయిలో పనిచేసే చిన్న ఉద్యోగి వరకూ గత ఏడాది కాలం కష్టపడి పనిచేసారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ హ్యాట్సాఫ్. ముఖ్యంగా నా టీచర్లు పూర్తి స్థాయిలో నాకు సహకారం అందించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఎలా అవమానించారో అందరూ చూసాం. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు క్యూ లైన్ కంట్రోల్ చేసేందుకు నిలబెట్టారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అనేక హామీలు ఇచ్చి ఉద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రజలకు చేరువగా ఉండండి
దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు. అవకాశం ఉన్నంత వరకూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టి పోయిన బకాయిలు చెల్లిస్తున్నాం. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం. నేను 65 ప్రజా దర్బార్లు నిర్వహించాను. ప్రతి రోజు ప్రజల్ని కలుస్తున్నాను. ఆ ఫైల్స్ అన్నీ మంత్రులకు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. అనేక సమస్యలతో వారు మీ దగ్గరకు వస్తారు. వారిని ఆప్యాయంగా పలకరించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి. ఉద్యోగులు తలుచుకుంటే స్వర్ణాంధ్ర కచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత పాలకుల అహంకారం, అరాచకంతో 151 – 11 అయింది. కాలర్ ఎగరేసి తిరగడం కాదు, ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని మంత్రి లోకేష్ హితవు పలికారు.
`