అమరావతి (చైతన్యరథం): మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జులై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అంతకు ముందు సిట్ అధికారులు ఆయన్ని మూడు గంటల పాటు విచారించారు. అయితే, సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్ లను చెవిరెడ్డి చించివేశారని సమాచారం.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. చెవిరెడ్డికి రిమాండ్ విధించింది.
చెవిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలు
ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెగ్యులర్గా టచ్లో ఉన్నారని రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. విచారణ జరుగుతుందని తెలిసిన వెంటనే పారిపోయేందుకు యత్నించారు. లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్ములను 2024 ఎన్నికలలో ఖర్చు చేశారు. చాలా నియోజకవర్గాలకు ఈ డబ్బులు పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు ఎలా తీసుకురావాలి, ఎక్కడెక్కడకు, ఎవరెవరికి పంచాలో చెవిరెడ్డే నిర్ణయించారు. చాలా నియోజకవర్గాలకు ఆయన ద్వారా డబ్బులు పంపిణీ జరిగింది. చట్ట విరుద్ధంగా లిక్కర్ కేసులో డబ్బులు తరలించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఉపయోగించుకుని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి డబ్బులు తరలించారు. చెవిరెడ్డి ని విచారణ చేసిన తరువాత అన్ని కోణాల్లో అతని పాత్ర ఉందని స్పష్టంగా తేలింది. ఈ కేసులో చెవిరెడ్డి ని అరెస్టు చేయకపోతే విదేశాలకు పరారయ్యే వారు. లిక్కర్ కేసులో జరిగిన రూ.3500 కోట్ల అవకతవకల్లో 200-250 కోట్లు వాహనాల ద్వారా తరలించి ఎన్నికలలో పంచారు. మద్యం నగదును తరలించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడ్డారు. సాధారణ ఎన్నికలకు ముందే ఎనిమిది కోట్ల రూపాయలను గరికపాడు చెక్ పోస్ట్ లో పట్టుకున్నారు. ఈ కేసులో ఎ36 ఎ37 గా ఉన్న ఇద్దరు నిందితులే ఆ డబ్బులు తరలించారు. ఈ డబ్బుతోనే ఓటర్లను కొనుగోలు చేసేందుకు యత్నించారు. చట్ట విరుద్దంగా, అప్రజాస్వామికంగా ఎన్నికలలో ఈ మద్యం డబ్బునే వాడారు. నేరపూరిత కుట్రలకు పాల్పడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు కోరారు.