- బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేష్ చర్చ
- ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష
- నైపుణ్య శిక్షణ, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం
న్యూఢిల్లీ (చైతన్యరథం): బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జులై నెలలో టోనీ బ్లెయిర్ను మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (టిబిఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలుచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టిబిఐ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టిబిఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మొహరించి రెండు ప్రధాన అంశాలపై..1). ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు 2). గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన…దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. ఏపీ విద్యాశాఖ, టిబిఐ నడుమ ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టిబిఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GఱGG) సలహాబోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్కు టిబిఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఈ సమావేశంలో విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.