- గంజాయి, బెట్టింగ్బ్యాచ్లకు పరామర్శలతో ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు
- చంపేస్తాం, నరికేస్తాం.. నినాదాలతో ప్రజల్లో భయాందోళనలు
- వాటికి జగన్ సమర్థింపు సైకో మనస్తత్వానికి నిదర్శనం
- అధికారం చేజారాక జగన్ మానసిక స్థితిపై అనుమానాలు
- తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం అంటూ ఉంటే అది పులివెందుల శాసనసభ్యుడు జగన్రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధికారం కోల్పోయినందుకు బాగా బాధపడుతున్న జగన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అతని మానసిక పరిస్థితి సరిగా లేదన్న అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. ఇటీవల గంజాయి బ్యాచ్, ఉన్మాదులు, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లతో జగన్ రెడ్డి సమావేశమవుతుండటం ఇందుకు నిదర్శమన్నారు. ఏడాది క్రితం చనిపోయిన వారిని ఇప్పుడు పరామర్శించడం వంటి పనులు చేస్తున్నారని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ చేష్టల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడి మరణిస్తున్నా తనకేం సంబంధం లేదన్నట్లు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని మంత్రి తప్పుబట్టారు. జగన్ పర్యటన ఓదార్పులా కాకుండా పల్నాడుపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు మృతికి నూటికి నూరు శాతం జగనే కారణమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ‘‘చంపేస్తాం, నరికేస్తాం’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకోల చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి, జగన్ చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని తప్పుబట్టారు. అమావాస్య-పౌర్ణమి కాలానికి ప్రజల్లోకి జగన్ రెడ్డి వచ్చి నానా బీభత్సం సృష్టించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి సీఎంగా వ్యవహరించినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను రాష్ట్రంలో తిరగనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. జగన్ బెదిరింపులకు ఆంధ్ర రాష్ట్రంలో భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. జగన్ అనుచరులు రౌడీ మూకల్లాగా వ్యవహరిస్తూ, పోలీసులపై జులుం ప్రదర్శించి, లెక్కలేకుండా వ్యవహరించారని, రౌడీ వ్యవస్థను రాష్ట్రమంతా తీసుకురావాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో యావత్ ప్రపంచం మనవైపు చూసేలా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.