- ఏడాదిలో ఎన్నో విజయాలు
- రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధి
- ప్రధాని మోదీ మార్గదర్శకత్వం, సీఎం చంద్రబాబు నేతృత్వంలో అగ్రగామిగా రాష్ట్రం
- డిప్యూటీ సీఎం పవన్ ఏడాది ప్రగతి నివేదిక
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి.. దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని.. ఏడాది కాలంలోనే చేసి చూపిస్తూ, ప్రజలతో పాటు, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామన్నారు. రానున్న నాలుగేళ్లలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. డిప్యూటీ సీఎంగా, వివిధశాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా సుపరిపాలనకు ఏడాది పేరుతో 20 పేజీలతో కూడిన 2024-2025 సమగ్ర అభివృద్ధి నివేదికను పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయానికి అండగా నిలిచి, రాష్ట్రాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి దూరమై శాంతిభద్రతలు క్షీణించి, యువత భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకొని, మహిళలకు రక్షణ కరువై.. రాజధాని నిర్మాణం ఆగిపోయిన సమయంలో ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. రాష్ట్రాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ, నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు సారథ్యంలో పోటీ చేశామని, అందరి సమష్టి సహకారంతో ఎన్డీయే కూటమి 164 అసెంబ్లీ సీట్లు గెలిచి 94శాతం స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయం సాధించిందని గుర్తు చేశారు.
ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వివరించారు. గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని.. ఏడాది కాలంలోనే చేసి చూపిస్తూ, ప్రజలతో పాటు, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి నేడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుండటంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లోందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని పరితపించే వ్యక్తిగా.. ఏడాది కాలంలో తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలని కోరారు. రాబోయే నాలుగేళ్లలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని, దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్న ఉన్నతాధికారులు, ఉద్యోగులను అభినందించారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.