అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభమై ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధి బృందాలు గురువారం అమరావతిలో పర్యటించాయి. ఈ బృందాలను సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ రాజధానిలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి పనులు జరుగుతున్న తీరును చూపించారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల్లో సీనియర్ ఎన్విరాన్మెంటలల్ స్పెషలిస్ట్ జోసెఫ్, పర్యావరణ సంరక్షణ కార్యకలాపాల సలహాదారు దమని జిత్ సింగ్ మిన్హాస్ ఉన్నారు.
అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, శాఖమూరు రిజర్వాయర్, ఎల్పీఎస్ జోన్ 2ఎ ప్రాజెక్టు సైట్, కార్మికుల క్యాంపులను ప్రపంచబ్యాంక్, ఏడీబీ బృంద సభ్యులు, సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారులు, సిబ్బంది పరిశీలించారు. ఆయా సైట్లలో పనిచేస్తున్న కార్మికులతో ప్రపంచబ్యాంక్, ఏడీబీ బృంద సభ్యులు మాట్లాడారు. నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థలు క్యాంప్ల్లో అందుబాటులో ఉంచిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. నిర్మాణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, సామాజిక రక్షణ, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు పాటించాల్సిన సురక్షిత విధానాలు, కార్మికుల భద్రత గురించి వారికి వివరించారు.