- పనితీరు ఆధారంగా పోస్టింగులు, బదిలీలు
- అక్రమాలకు, రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట
- వారసత్వంగా వచ్చిన సమస్యల్ని అధిగమిస్తున్నాం
- కూటమి ప్రభుత్వ మొదటి ఏడాదిలో ప్రభుత్వ వైద్య రంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం
- ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని అందించే దిశగా సానుకూల వాతావరణాన్ని కల్పించి మంచి ఫలితాల్ని సాధించే దిశగా మొదటి అడుగు వేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ వైద్య రంగంలో భాగస్వాములైన అందరూ జవాబుదారీతనం, క్రమశిక్షణలతో వ్యవహరించడం.. అన్ని స్థాయిల్లో వైద్యులు, అధికారులు, ఇతర సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ ఫలితాల్ని మదింపు చేయడం.. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించడం, అక్రమాలు, రాజకీయ జోక్యాన్ని అడ్డుకోవడం.. వంటి అంశాల ఆధారంగా వైద్య సేవల్ని మెరుగుపర్చడానికి గత ఏడాది కాలంగా కృషి చేసినట్లు మంత్రి వివరించారు.
ఈ మేరకు మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు, ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి 5 పేజీల వివరణాత్మక నివేదికను మంత్రి సత్యకుమార్ యాదవ్ సమర్పించారు. గతేడాది జూన్ 16న పదవీ స్వీకారం చేసిన మంత్రి ఈ నెల 16న ముఖ్యమంత్రికి తన నివేదికను పంపారు.
క్రమశిక్షణ, .జవాబుదారీతనం
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా వైఖరితో వైద్య సిబ్బందిలో గైరు హాజరీ, జవాబుదారీతనం లేకపోవడం, వివిధ స్థాయిల్లో పనితీరు, ఫలితాలపై పర్యవేక్షణ లోపించడం కారణంగా వైద్య సేవల నాణ్యత దెబ్బతిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వారసత్వంగా సంక్రమించిన ఈ సమస్యల్ని అధిగమించడానికి నిర్దిష్ట ప్రణాళికలతో కూటమి ప్రభుత్వం గత ఏడాదిగా చేసిన కృషి సత్ఫలితాల్ని ఇస్తోందని మంత్రి తన నివేదికలో ముఖ్యమంత్రికి వివరించారు. వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల్లో కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పాలనలో ఇతోధికంగా పెరుగుదలను సాధించామని, ఇది ప్రజారోగ్య రంగంలో వచ్చిన మార్పునకు నిదర్శనమని మంత్రి సత్యకుమార్ వివరించారు. తత్ఫలితంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సర్వేల్లో ప్రభుత్వ వైద్య సేవల పట్ల సానుకూలత బాగా పెరిగిందని ఆయన తెలిపారు.
ప్రశ్నించడం ద్వారా మెరుగైన పాలనా ప్రక్రియ
ఏ రంగంలోనైనా సత్ఫలితాల్ని సాధించడానికి సమగ్ర సమాచారంతో విశ్లేషణాత్మక ప్రతిపాదనలతో కూడిన నిర్ణయాలు ప్రధానమని మంత్రి అన్నారు. పరిపాలనా బాధ్యతల్ని పలు స్థాయిల్లో నిర్వహిస్తున్న వైద్యుల్లో పాలనా విషయాల్లో సరైన శిక్షణ, నిపుణత లోపించడంతో పాటు మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న కింది, మధ్య స్థాయి అధికారుల సామర్ధ్యంలో కొరత కారణంగా పలు అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించడంలో సమగ్రత లోపించడాన్ని తాము గుర్తించామని, దీన్ని అధిగమించడానికి తన ప్రయత్నం చేశానని మంత్రి సత్యకుమార్ వివరించారు. అలాంటి లోపాలు తన దృష్టికొచ్చిన ప్రతిసారీ నిర్మొహమాటంగా తగు ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు వివరణల్ని కోరడం ద్వారా దస్త్రాల్ని(ఫైళ్లు) సమర్పించే విధానంలో మార్పుల్ని తెచ్చామని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నం సానుకూల ఫలితాల్ని ఇస్తోందని…యథాలాపంగా దస్త్రాల్ని పంపితే మంత్రి లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న ఆలోచన అధికారుల్లో కలిగి వారు జాగ్రత్త వహిస్తున్నారని మంత్రి చెప్పారు.
అక్రమాలు, రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట
గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న అక్రమాలు, రాజకీయ జోక్యంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయిలో జరిగిన వైద్య సిబ్బంది నియామకాల జాబితాలు కలెక్టర్ల కార్యాలయాల్లో కాకుండా మంత్రుల ఇళ్లల్లో తయారయ్యాయని, ఆ కాలంలో నెలకొన్న అవినీతి, అక్రమాలు, రాజకీయ జోక్యానికి ఇది అద్దం పట్టిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ నివేదికలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వైఖరికి గతేడాదిలో అడ్డుకట్ట వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 8,000 పైగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాన్ని ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా చేపట్టామన్నారు. వివిధ నిర్మాణ పనులు, మందులు, పరికరాల కొనుగోళ్లలో నియమనిబంధనల ప్రకారం టెండర్లపై నిర్ణయాల్ని తీసుకున్నట్లు ఆయన వివరించారు.
మెరుగైన పనితీరుకు ప్రోత్సాహం
గతానికి భిన్నంగా వివిధ స్థాయిల్లో మంచి పనితీరును కనపర్చిన వారిని ప్రోత్సహించే దిశగా తాము నిర్దిష్టమైన చర్యల్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు జిల్లా స్థాయి అధికారులైన డీఎంహెచ్వోలు, డీసీహెచ్ఎస్లతో పాటు ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్ల పోస్టింగులు, బదిలీలు చేశామని ఆయన వివరించారు.
వ్యత్యాసం
ఐదేళ్ల గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యానికి సంబంధించిన పలు అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి తెలిపారు. కేంద్రం నుండి కొత్త పథకాలు, నిధుల మంజూరులో ఈ విషయం స్పష్టమయ్యిందనిన్నారు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వ మొదటి ఏడాదిలోనే రూ.1,065 కోట్ల వ్యయంతో గ్రామ స్థాయిలో 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి కేంద్ర అనుమతిని పొందామని, 10 నూతన క్రిటికల్ కేర్ బ్లాకులు, 13 సమీకృత ప్రజారోగ్య ప్రయోగ శాలలు మంజూరయ్యాయని, మున్నెనడూ లేని విధంగా ఆయుష్ సేవలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.83 కోట్ల కేంద్ర నిధుల మంజూరు, ఆహార పదార్థాల నాణ్యత నిర్ధారణ నిమిత్తం ప్రయోగశాలల నిర్మాణానికి రూ.90 కోట్ల కేంద్ర నిధులు పొందగలిగామని మంత్రి సత్యకుమార్ యాదవ్ నివేదికలో వివరించారు.
కృషికి గుర్తింపు
క్షేత్ర స్థాయిలో ఆరోగ్య పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ, ఫలితాల మదింపు ప్రాతిపదికన 2024-25 కాలంలో రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ అమలు తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ పనితీరుకు ప్రోత్సాహకంగా రాష్ట్రానికి రూ.100 కోట్లు విడుదల చేసిందన్నారు. మొదటి ఏడాదిలో రాష్ట్రంలో ప్రజారోగ్య సేవల్ని మెరుగుపర్చడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషికి ఇది సాక్షాత్కారమని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకొచ్చారు.
మార్పు తెచ్చాం-మరింతగా కృషి చేయాలి
కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో ప్రభుత్వ వైద్య రంగ పాలన, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో నిర్దిష్ట విధానాలతో ప్రజారోగ్య రంగంలో మార్పు తేగలిగామని…అయితే ముఖ్యమంత్రి ఆశయాల మేరకు ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా చేయాల్సింది ఇంకా ఉందని, ఆమేరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.