- కేవలం రాజకీయ కోణంలోనే తెలంగాణ నేతల విమర్శలు
- కేసీఆర్ది ద్వంద్వ వైఖరి
- అప్పట్లో గోదావరి వరద జలాలు సీమకు తరలించేందుకు అంగీకారం
- అసెంబ్లీలోనే ప్రకటించిన నాటి సీఎం జగన్
- ఇప్పుడు వరద జలాలు తీసుకుంటామంటే అడ్డగోలు మాటలు
- తెలంగాణ నేతల విమర్శలపై జగన్ ఎందుకు నోరెత్తడం లేదు
- ఆ రాష్ట్ర ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు ఎప్పుడూ అడ్డుకోలేదు
అమరావతి (చైతన్యరథం): బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం` బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మంత్రి నిమ్మల వివరించారు. 50 ఏళ్లుగా గోదావరి నీరు సగటున ఏటా వృథాగా 3000 టీఎంసీల వరకు సముద్రంలో కలుస్తోందని, ఇందులో 200 టీఎంసీల నీటిని బనకచర్లకు తరలించటమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ఉద్దేశమని తెలిపారు. మూడు సెగ్మెంట్లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు.. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు.. బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు… ఇలా మూడు సెగ్మెంట్ల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తామని మంత్రి నిమ్మల వెల్లడిరచారు.
రాజకీయం కోసమే ఆరోపణలు
బనకచర్లపై తెలంగాణ నేతలు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయ దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అన్ని నియమనిబంధనల ప్రకారమే అనుమతి తీసుకుని నిర్మాణం జరుగుతుందన్నారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి ఇప్పటికే ప్రాథóమిక నివేదిక ఇచ్చామని తెలిపారు. ఆమోదం లేకుండా డీపీఆర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని, ప్రాథమిక నివేదిక ఆమోదం తెలిపాక డీపీఆర్ ఇస్తామని మంత్రి తెలిపారు. పోలవరం`బనకచర్ల అనుమతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని మరోసారి స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రానికీ నష్టం లేదు..
ఏపీ జలదోపిడీ అని తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారని, వరద జలాలు ఉపయోగించుకోవడం తమ హక్కు అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. దిగువ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు… నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాలు ఉపయోగించుకుంటుందని మంత్రి వివరించారు. ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని, ప్రతి ఏడాది 3వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. ప్రస్తుతం ఇంకా వర్షాకాలం పూర్తిగా రాకుండానే సముద్రంలోకి నీరు వృథాగా పోతోందని అన్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు సరైన అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టులకే అనుమతి లేదని, ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని… సీఎం చంద్రబాబుకు అసలే లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. సీతారాం సాగర్ లిఫ్ట్కు కూడా ఇటీవలే అనుమతి వచ్చిందని, కానీ అప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. దిగువ రాష్ట్రంగా గోదావరి వరద ముంపు కష్టాలను ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఏళ్లుగా భరిస్తోందన్నారు. ఆ కష్టాలు, నష్టాలు భరిస్తున్న మన రాష్ట్రానికి వరద జలాలు వాడుకునే హక్కు సహజంగానే ఉంటుంది. గోదావరిలో ఏటా కనిష్ఠంగా 100 రోజుల పాటు వరద ఉంటుంది. వరదల సమయంలోనే రోజుకు 2 టీఎంసీల చొప్పున బనకచర్ల ప్రాజెక్ట్కు అవసరమైన 200 టీఎంసీలు తీసుకుంటాం. నికర జలాల తీసుకునే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్కు లేదని మంత్రి నిమ్మల చెప్పారు
ఎప్పుడూ అడ్డుకోలేదు..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు చాలా ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే నిర్మించారు. ఎస్సార్ఎస్పీ, బీమా, గుత్ప, అలీసాగర్, ఎత్తిపోతల పథకాలకు కూడా చంద్రబాబు ఎంతగానో కృషి చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగాక కాళేశ్వరం, సీతారామసాగర్, సమ్మక్క బ్యారేజీలను తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన్పటికీ చంద్రబాబు ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం మనకు ఎగువన ఉంది. సరైన సాంకేతిక మదింపు లేకుండా ఎగువన ప్రాజెక్ట్లు నిర్మిస్తే దిగువున అప్పటికే పూర్తయిన ప్రాజెక్ట్ కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోతారు. లోయర్ రైపేరియన్ రైట్స్ (దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులు) అనేవి నదీజలాల జలాల చట్టంలోనే ముఖ్యమైన అంశం. చంద్రబాబు దీని గురించే చెప్పారు. అంతే తప్ప తెలంగాణ ప్రాజెక్ట్లను అడ్డుకోవాలనే దురుద్దేశాలు అప్పుడూ లేవు.. ఇప్పుడూ లేవని మంత్రి నిమ్మల తేల్చి చెప్పారు. దిగువ రాష్ట్రాలకు ఉన్న హక్కుల ప్రకారం చంద్రబాబు కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభిప్రాయం చెప్పారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఈ విషయాన్ని తెలంగాణా ప్రజలు గుర్తించాలన్నారు.
ద్వంద్వ వైఖరి
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. 2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించి నీటి పంపకాలు చేసుకుందామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి నదిలో వృథాగా పోయే 3000 టీఎంసీల జలాల్లో సాధ్యమైనంత మేర సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అపెక్స్ కౌన్సిల్లో ఇరు రాష్ట్రాల సీఎంల మాటలు మినిట్స్ రూపంలో నమోదై ఉన్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. నాడు ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన కేసీఆర్..రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి గోదావరి వరద జలాల తరలింపే మార్గమని పదేపదే చెప్పారు. అలాంటి కేసీఆర్ నేడు ప్రతిపక్షంలో ఉండి వరద జలాలను మాత్రమే వినియోగించుకునే బనకచర్లకు అడ్డు చెప్పటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మంత్రి నిమ్మల ఆక్షేపించారు.
జగన్ ఆంతర్యమేమిటి..
నాడు గోదావరి ఎగువ ప్రాంతం నుండి వరద సమయంలో రోజుకు 4 నుండి 5 టీఎంసీల చొప్పున 120 రోజుల్లో 400 నుండి 500 టీఎంసీల జలాల వరకు శ్రీశైలం తరలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను నిర్ణయించినట్లుగా నాటి సీఎం జగన్ సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాడు గోదావరి జలాల తరలింపునకు అంగీకారం తెలిపిన కేసీఆర్ నేడు పోలవరం వద్ద వరద జలాల్లో 200 టీఎంసీలను తరలించే బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకించటం అర్థరహితమని మంత్రి నిమ్మల అన్నారు. అప్పట్లో కేసీఆర్తో కలిసి గోదావరి వరద జలాల తరలింపుపై నిర్ణయం తీసుకున్న జగన్రెడ్డి.. నేడు రాయలసీమను సస్యశ్యామలంగా మార్చే బనకచర్ల ప్రాజెక్ట్ను అదే కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు వ్యతిరేకిస్తుంటే నోరు మెదపకపోవటంలో ఆంతర్యం ఏమిటని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. తెలంగాణ నేతల అభ్యంతరాలను రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ ఎందుకు ఖండిరచటం లేదని నిలదీశారు.
ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం లేకుండా, వారి న్యాయబద్ధమైన అవసరాలు తీరాకనే.. కేవలం వృథాగా సముద్రంలో కలిసే వరద జలాల్లో 200 టీఎంసీలను మాత్రమే బనకచర్ల ప్రాజెక్ట్కు వినియోగించుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం. సీడబ్ల్యూసీకి ఇదే విషయం తెలియజేశాం. ఎగువ రాష్ట్రాల హక్కులు హరించే దురుద్దేశం ఏ మాత్రం లేదు. అందరూ బాగుండాలి.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.