అమరావతి (చైతన్యరథం): మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. ఎఫ్ఎఆర్లో ఏ38గా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. అంతకుముందు మంగళవారం ఉదయం చెవిరెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఏపీ లిక్కర్ స్కాంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులకు కెంపెగౌడ విమానాశ్రయ పోలీసులు తెలియచేయటంతో ఏపీ సిట్ అధికారులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లి చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడ తరలిస్తున్నారు.