- రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన..
- పిల్లల చదువుల బాధ్యత సర్కారుదేనని హామీ
- అండగా ఉంటామని ధైర్యం చెప్పిన సీఎం
అమరావతి (చైతన్య రథం): చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితురాలిని పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారినుంచి వేధింపులు ఎదురయ్యాయా? అని సీఎం అడగ్గా పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని శిరీష వాపోయారు. ఈ ఘటనతో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇలాంటి ఘటనలను సహించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్న సీఎం.. వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి.. అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఘటన, అనంతర పరిణామాలపై నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.