ఈ విషయంలో కేంద్రం సహకారం అవసరం
సుంకాలు, జీఎస్టీ తగ్గించే చర్యలు తీసుకోండి..
హెచ్డీ బర్లీ కొనుగోలుకు రూ.150 కోట్లు సాయం చేయండి
ఆక్వా ఎగుమతులపై సుంకాల భారం తగ్గేలా అమెరికాతో చర్చించండి
మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గించండి
పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలి
కేంద్రమంత్రి పీయూష్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరువురు సుదీర్ఘ భేటీ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య ఆదివారం భేటీలో కీలక చర్చ జరిగింది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు, క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపువంటి అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను.. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు, ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు.
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలుకు రూ.150 కోట్లు ఇవ్వండి
ప్రస్తుత సీజన్లో హెచ్డీ బర్లీ, వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు తగ్గిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు వివరించారు. పొగాకు కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించిందని తెలిపారు. దీంట్లో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడిరచారు. ఈమేరకు బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 కొనుగోలు కేంద్రాలను ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసినట్టు వివరించారు. కోనుగోలు కోసం రూ.150 కోట్లను టొబాకో బోర్డు ద్వారా వ్యయం చేసేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 1.31 లక్షల హెక్టార్లల్లో పొగాకు సాగు చేశారని, గతేడాదికంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ తగ్గడంతో ధరల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ను టొబాకో బోర్డు పరిధిలోకి తెచ్చేలా చట్టాన్ని సవరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
క్రూడ్ పామాయిల్పై సుంకం తగ్గింపు గురించి పునరాలోచన చేయండి
క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గించడంవల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంతో పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని వివరించారు. క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. సుంకం తగ్గింపుతో కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలను చేరుకోలేమన్న విషయాన్ని గమనించాలని చంద్రబాబు సూచించారు.
ఆక్వా రైతును ఆదుకోండి
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలవల్ల ఏపీలోని 8 లక్షల ఆక్వా రైతులు నష్టపోతున్నారని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన 27శాతం సుంకాన్ని తగ్గించేలా ఆ దేశ అధికారులతో మాట్లాడాలని కోరారు. ఆక్వా రైతులపై ఈ టారిఫ్ భారం తగ్గించి సంక్షోభంనుంచి బయటపడేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి దారులు సంక్షోభంలో పడ్డారని ముఖ్యమంత్రి వివరించారు.
మ్యాంగో పల్ప్పై జీఎస్టీని తగ్గించండి
మ్యాంగో పల్ప్పై జీఎస్టీని 12నుంచి 5శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను సీఎం చంద్రబాబు కోరారు. మామిడి తాండ్రపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, అదే తరహాలో మ్యాంగో పల్ప్కు కూడా వర్తింపచేయాలని సూచించారు. జీఎస్టీ తగ్గిస్తే మామిడి రైతులకు, పల్ప్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సీఎం చంద్రబాబు పీయూష్ గోయల్కు వివరించారు. సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని పొగాకు, పామాయిల్, మామిడి రైతులకు మేలు కలిగేలా చర్యలు చేపడతామని అన్నారు. భేటీ అనంతరం కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి.. జ్ఞాపికను అందచేశారు.